అమరావతి: జనరంజక పాలన అందించి అభిమానుల హృదయాల్లో దేవుడుగా ముద్రవేసుకున్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహనరెడ్డి నవ్యాంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ వరుణ దేవుడూ కరుణించాడనీ వైఎస్ఆర్ అభిమానులు పేర్కొంటున్నారు. నేటి మధ్యాహ్నం 12.23గంటలకు జగన్ ప్రమాణ స్వీకారం చేయనుండగా రాత్రి ఒక్క సారిగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. ఉదయం పది గంటల సమయానికే వేసవి ఎండ తీవ్రతకు బయటకు రాని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రాత్రి వర్షం పడటంతో నేడు ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. వాతావరణం చల్లబడటం, ఎండ తీవ్రత కొంత మేర తగ్గడంతో జగన్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ప్రజలు కొంత ఊరట చెందుతున్నారు. ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు వర్షం పడటం శుభ సూచికమనీ, నాడు వైఎస్ఆర్ అధికారం చేపట్టిన సమయంలోనూ వర్షం పడిందనీ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాలంలో సకాలంలో వర్షాలు పడ్డాయనీ, రైతులు సుభిక్షంగా ఉన్నారనీ, అదే మాదిరిగా నేడు జగన్ పరిపాలన సమయంలోనూ వరుణ దేవుడు కరుణిస్తాడనీ పేర్కొంటున్నారు.
భగవంతుడి ఆశీస్సులు, రాష్ట్ర ప్రజల దీవెనలతో రికార్డు స్థాయిలో 175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాల్లో వైసిపి గెలిచి జగన్మోహనరెడ్డి సిఎంగా పట్టాభిషిక్తుడవుతున్నరనీ, మాజీ ముఖ్యమంత్రుల తనయులు ఎవరూ రాష్ట్రంలో ఇప్పటి వరకూ ముఖ్యమంత్రులు కాలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే రెండు రికార్డులు సాధించాడనీ, తండ్రికి మించిన పాలన అందించి మూడవ రికార్డు జగన్ సొంతం చేసుకుంటారని వైసిపి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.