అమరావతి: జననేత వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారాన్ని కళ్లారా వీక్షించేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, అభిమానులు తరలిరావడంతో విజయవాడ నగర వీధులు జనసంధ్రమయ్యాయి. 12.23గంటలకు వైఎస్ జగన్తో గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనుండగా సభావేదిక అయిన ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ఉదయం తొమ్మిది గంటలకే జనంతో నిండిపోయింది. జగన్మోహనరెడ్డి రాక కోసం స్టేడియంలో వేలాది మంది ప్రజానీకం ఎదురుచూస్తుండగా స్థలాభావం వల్ల వివిధ ప్రాంతాల నుండి వచ్చినవారు నగరంలోని వివిధ కూడళ్లలో ఉండిపోవాల్సి వచ్చింది. సభా వేదికతో పాటు మొత్తం 14 ప్రదేశాలలో జగన్ ప్రమాణ స్వీకారం ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్ద పెద్ద ఎల్ఇడి తెరలను ఏర్పాటు చేశారు.
మంగళవారం రాత్రి ఒక్క సారిగా గాలి దుమారంతో వర్షం పడి వేదిక వద్ద చేసిన ఏర్పాట్లు కొంత దెబ్బతిన్నా యుద్ధ ప్రాతిపదికన పూల డెకరేషన్, షామియానాలు తదితర ఏర్పాట్లు ఉదయాని కల్లా సిద్ధం చేశారు. సభా వేదిక ప్రాంగణంలో సుమారు 25నుండి 30వేల వరకూ సీటింగ్ ఏర్పాటు చేయగా 15వేల మందికి పాస్లను జారీ చేశారు. విఐపి గ్యాలరీకి అవతల సాధారణ సందర్శకులు మరో 15 వేల మంది కూర్చుని ప్రమాణ స్వీకారం చూసే ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో జగన్ ప్రమాణ స్వీకారానికి వచ్చినట్లు భావిస్తున్నారు. విజయవాడలోని అన్ని హోటళ్లు నిండిపోయాయి.
వైఎస్ జగన్ 11.30 గంటలకు తాడేపల్లి నివాసం నుండి వేదికకు బయలుదేరి రానున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ, ఒడిషా ముఖ్యమంత్రులు కెసిఆర్, నవీన్ పట్నాయక్, డిఎంకె నేత స్టాలిన్లు హజరుకానున్నారు.