వైసీపీలో రెబల్స్ జాబితా పెరుగుతోంది. ఇప్పటికే ఎంపీ రఘురామకృష్ణ రాజు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ సీఎం జగన్ ను ఇరుకునపెట్టే విధంగా మాట్లాడుతున్నారు. బీజేపీ, టీడీపీ కూడా లేవనెత్తని సున్నితమైన అంశాలను రఘురామకృష్ణరాజు లేవనెత్తుతున్నారు. ఇప్పుడు ఆయనతోపాటు మరికొంత మంది రెబెల్స్ గా మారబోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ వ్యవహారశైలి కారణంగా, మంత్రుల తీరు కారణంగా కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ, అధినేతపై అసంతృప్తిగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకూ..
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన పార్టీ పట్ల ప్రస్తుతం విధేయుడిగానే ఉన్నారు. ఎమ్మెల్యేలు రెబల్ గా మారితే మొదట ఆయన పేరే వస్తుందని అంటున్నారు. మంత్రి పదవి దక్కకపోవటం, సొంత పనులు చేయించుకోలేక పోవడం, కార్యకర్తలకు ఉపాధి కల్పించలేక ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. విశాఖలో కొందరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ప్రకాశం జిల్లాలో ఎంపీ, నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే, చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఇలా రాష్ట్రవ్యాప్తంగా అధిష్టానంపై, సీఎం జగన్ పై అసంతృప్తి గాలులు వీస్తున్నాయని అంటున్నారు. అయితే.. పార్టీలో ఇటువంటివి సర్వసాధారణమని.. త్వరలో సద్దుమణుగుతాయని సీనియర్లు అంటున్నారు. రెబెల్స్ మాత్రం తామంతా ఓసారి సీఎం జగన్ ను కలసి మాట్లాడటానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం పార్టీలో చాప కింద నీరులా ఉంది. ఇది మరెంత దూరం వెళ్తుందో చూడాల్సి ఉంది.