ఏపీ పాలిటిక్స్ లో హీటెక్కిస్తున్న అంశం పోలవరం ప్రాజెక్టు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాల్వలు తవ్వారు. వైఎస్ మరణం.. రాష్ట్ర విభజనతో పనులు నెమ్మదించాయి. దీంతోపాటే అనేక అంశాలు మెలి తిరిగాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. నిధులిస్తే.. తామే ప్రాజెక్టు కడతామని టీడీపీ చెప్పింది. 2019లో రాష్ట్రంలో అధికారం మారింది. కేంద్రంలో బీజేపీనే మళ్లీ వచ్చింది. కానీ.. ఇప్పుడు ఖర్చుల విషయంలో కొత్త మెలిక పెడుతోంది. దీంతో సీఎం జగన్ అలెర్ట్ అయ్యారు. ప్రధానికి లేఖ రాసిన ఆయనే.. పరిస్థితులను బట్టి ఎంపీలతో రాజీనామా అంశాన్ని కూడా లోపాయకారిగా పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
పోలవరంపై.. కేంద్రం వర్సెస్ రాష్ట్రం
టీడీపీ హయాంలో పోలవరంలో అవినీతికి పాల్పడిందని వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. దాదాపు 1000 కోట్లు ఆదా చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ‘సంచి లాభం.. చిల్లు లాగేసింది’ అనే సామెత చెప్పినట్టు కేంద్రం కొత్త కొర్రీ పెట్టింది. పెరిగిన అంచనాల ప్రకారం నిధులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి కలిపి ప్రస్తుత అంచనాలు 55వేల కోట్లకు చేరింది. 2014 పాత అంచనాల ప్రకారమే ఇస్తామని చెప్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కలవరపాటుకు గురైంది. వెంటనే సీఎం జగన్ ప్రధానికి లేఖ రాయడం కూడా జరిగింది. కారణం.. ఏపీ ప్రజలకు పోలవరం ప్రాజెక్టు ఓ అండర్ కరెంట్ సెంటిమెంటే కాకాండా ప్రాణధార కూడా.
వైసీపీనే తత్తరపడేలా చేసిన కేంద్రం..
పోలవరం ప్రాజెక్టులో టీడీపీ అవినీతికి పాల్పడుతోందని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ వాదించింది. చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంలా వాడుకుంటున్నారని ప్రధాని మోదీ కూడా అన్నారు. నిజానికి పోలవరం అంచనాలను 55 వేల కోట్లకు పెంచింది టీడీపీనే. అయితే.. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీకి కేంద్రం పాత అంచనాల్నే ఇస్తామని చెప్పడంతో షాక్ తగిలినట్టైంది. కేంద్రం సహకారం లేకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తవడం అసాధ్యమనే విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియంది కాదు. దీంతో.. పరిస్థితి అంతదాకా వస్తే తమ ఎంపీలతో రాజీనామా చేయించాలని ఆలోచిస్తున్నట్టు వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రానికి అల్టిమేటం కూడా జారీ చేయనుందని అంటున్నారు. గతంలో టీడీపీ చేసిన తప్పునే వైసీపీ చేయదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరి.. వైసీపీ వ్యూహం ఎలా ఉంటుందో.. పోలవరంపై ఎలా ముందుకెళ్తారో చూడాల్సిందే.