చేవెళ్ల విజయ సంకల్ప సభలో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని ప్రకటించారు. కేసిఆర్ సర్కార్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని విమర్శించారు. తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ అవినీతి పాలన సాగిస్తొందనీ, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 90 అసెంబ్లీ, 12 లోక్ సభ సీట్లే లక్ష్యంగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ అవినీతి, అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు.
కేసిఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజలను మోడీ నుండి దూరం చేయలేరని అన్నారు. పేపర్ లీకేజీపై ప్రశ్నిస్తే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్టు చేస్తారా.. ఆయన ఏం తప్పు చేశాడని అరెస్టు చేశారు అని మండిపడ్డారు. అక్రమ అరెస్టులకు బీజేపీ నేతలు, కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఈటలను మాట్లాడనివ్వడం లేదన్నారు. తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏ పరీక్ష పెట్టినా పేపర్ లీక్ అవుతోందని, పేపర్ లీకేజీలపై ఇప్పటి వరకూ సీఎం కేసిఆర్ స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ జరగడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో కేంద్ర పథకాలు ప్రజలకు చేరడం లేదని అన్నారు.
ప్రధాని కావాలని కేసిఆర్ కలలు కంటున్నారనీ, 2024లో ప్రధాని సీటు ఖాళీగా లేదని కేసిఆర్ తెలుసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మోడీనే ప్రధాని అవుతారని అన్నారు. కేసిఆర్ ముందు సీఎం సీటు కాపాడుకోవాలన్నారు. ఎంఐఎంకు భయపడే కేసిఆర్ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని అన్నారు. ఓవైసీ ఎజెండానే కేసిఆర్ అమలు చేస్తున్నారని విమర్శించారు. ఎంఐఎంకు బీజేపీ భయపడదని అమిత్ షా స్పష్టం చేశారు. కుటుంబ పాలనను తరిమికొట్టాలని అమిత్ షా పిలుపునిచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్న అమిత్ షా.. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. అవినీతి కేసుల్లో కేసిఆర్ కుటుంబం ఇరుక్కుందని విమర్శించారు. ప్రజలు తమకు ఒక సారీ అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీని ఆశీర్వదిస్తే అంతా మంచే జరుగుతుందని అన్నారు.