Telangana teachers: తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు ఎన్నికల్లో అధికార పార్టీ పై ప్రభావం చూపుతాయి. ఉపాధ్యాయులకు సంభందించి పాఠశాల విద్యా శాఖ తాజాగా తీసుకున్న కీలక నిర్ణయం వివాదాస్పదం అవ్వడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఉపాధ్యాయ వర్గాల నుండి వ్యతిరేకత రాకుండా వెంటనే చర్యలు తీసుకుంది కెసిఆర్ సర్కార్.
తెలంగాణలో ఉపాధ్యాయులు ప్రతి ఏటా స్థిర చారాస్తుల వివరాలు ఇవ్వాలని, ఆస్తులు కొనుగోలు, అమ్మకాల సమయంలో తెలియచేయాలనీ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాల నుండి వ్యతిరేకత వ్యక్తం అయింది. కొందరు ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు ఇతర మార్గాల్లో ఆదాయం పొందుతున్నారు అన్న ఆరోపణల నేపథ్యంలో విద్యా శాఖ శనివారం పై విధంగా ఉత్తర్వులు ఇచ్చింది.
దీనిపై ఉపాధ్యాయ వర్గం నుండి వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశాలు ఉండటంతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెంటనే స్పందించారు. విద్యా శాఖ జారీ చేసిన ఆదేశాలను సస్పెండ్ చేసినట్లు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. ఆ ఆదేశాలు తక్షణమే నిలిపి వేసినట్లు చెప్పారు. నిలిపివేత ఉత్తర్వులు తక్షణమే జారీ చేయాలని విద్యా శాఖ కార్యదర్శి ని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదేశించారు. దీనితో ఉపాధ్యాయ వర్గానికి ఊరట లభించినట్లు అయింది.