తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించి అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీ జాతీయ నాయకత్వం కూడా తెలంగాణపై ప్రత్యేక శ్రద్ద చూపుతోంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల ప్రజాసంగ్రామ యాత్ర పూర్తి చేసుకున్న బండి సంజయ్ నేటి నుండి మూడో విడత పాదయాత్ర యాదాద్రి నుండి ప్రారంభిస్తున్నారు. యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లిల జరిగే ప్రారంభోత్సవ సభకు కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డిలు పాల్గొంటున్నారు. బహిరంగ సభ కేంద్ర మంత్రి షెకావత్ జెండా ఊపి పాదయాత్ర ప్రారంభిస్తారు. మూడవ విడత పాదయాత్ర 24 రోజుల పాటు కొనసాగుతుంది. యాదాద్రి నుండి జనగామ జిల్లా మీదుగా వరంగల్లుకు చేరుకుంటుంది. వరంగల్లు లోని భద్రాకళిని దర్శించుకుని యాత్రను ముగిస్తారు బండి సంజయ్.
మరో పక్క సీనియర్ నేతలు డీకే అరుణ, ఈటల రాజేందర్ లు నేడు ఢిల్లీలో జాతీయ బీజేపీ నేతలతో భేటీ కానున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నుండి పలువురు నేతలను బీజేపీలో చేర్చుకునే కార్యక్రమానికి ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలుస్తొంది. ఎవరెవరు పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నారు, వారి రాజకీయ చరిత్ర, తదితర వివరాల జాబితాను ఈటల సిద్దం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై నేడు జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపి నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయి చర్చించనున్నారు. ఆగస్టు నెలలో భారీగా చేరికలు ఉంటాయని గత నెలలోనే ఈటల రాజేందర్ ప్రకటించారు.