Children’s Story: అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. సింహం చాలా బలమైనది. రోజు రోజూ ఒక జంతువును చంపేసి తినేసేది. ఒకొక్క సారి ఆకలి లేకపోయినా ఆట కోసం వేరే జంతువులను చంపుతుండేది. అడవిలో జంతువులన్నీ ప్రాణ భయంతో ఉండేవి. ఈ సమస్యని ఎదుర్కోవడం ఎలా అని ఒక రోజు అన్ని జంతువులూ కలిసి అలోచించాయి. అందరూ సింహాన్ని కలిసి సంధి చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. అనుకున్న ప్రకారం నక్క చేత సింహానికి కబురు పెట్టాయి. ఒక పెద్ద చెట్టు కింద జంతువులన్నీ సింహాన్ని కలవడానికి వచ్చాయి. సింహం కూడా కొద్ది సేపటికి వచ్చింది. ఒక ముసలి కోతి సింహంతో ఇలా అంది, ‘మీరు మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు ధన్యవాదములు’ అనడంతో సింహం దర్జాగా తల ఊపింది.
అప్పుడు కోతి కల్పించుకుని .. మీరు భోజనానికి రోజుకు ఒక జంతువుని చంపడం సమంజసమే. మీకు ఆహారం కావాలి కాబట్టి, కానీ.. అవసరానికి మించి మీరు జంతువులను చంపడం న్యాయం కాదని అంది. మీరు ఒప్పుకుంటే ఈ రోజు నుంచి మేమే మాలో ఒక్కళ్ళని చీటీలు వేసుకుని ఎంచుకుంటాము. ఆ చీటీలో ఏ జంతువు పేరు ఉంటుందో, ఆ జంతువు నేరుగా మీ గుహకు వచ్చి మీకు ఆహరం అవుతుంది. ఈ ఒప్పందం మీరు ఒప్పు కుంటే అడవిలో ఉన్న జంతువులు అన్నీ ప్రశాంతంగా ఉంటాయని చెప్పింది. సింహానికి ఈ అయిడియా బాగా నచ్చింది. అడివిలోని జంతువులు వాటంతట అవే తన వద్దకు ఆహారం అయ్యేందుకు వస్తుంటే తాను ఇక వేటకి వెళ్లాల్సిన అవసరం ఉండదని సంతోషిస్తూ కోతి చేసిన ప్రతిపాదనకు సింహం ఒప్పుకుంది.
రోజుకొక జంతువు అనుకున్న దాని ప్రకారం సింహానికి బాలి అవ్వడం మొదలు పెట్టాయి. కొన్ని రోజులకి ఒక కుందేలు వంతు వచ్చింది. పాపం ఆ కుందేలు చాలా భయ పడిపోయింది. సింహానికి బలి అవ్వడానికి అస్సలు ఇష్టం లేదు. ఎలాగ భగవంతుడా అని కుందేలు చాలా ఆలోచించింది. ఎలాగో గుండెను నిబ్బరం చేసుకుని ఆ సింహం గుహ వైపుకు బయలుదేరింది. మార్గ మధ్యలో ఒక నుయ్యి (బావి) కనిపించింది. నూతిలో నీళ్ళు చూసే సరికి ఆ కుందేలుకు ఒక ఉపాయం (అయిడియా) తట్టింది. అక్కడే పొద్దు పోయే వరకూ ఉండి సాయంత్రానికి ప్రశాంతంగా లేచి పరిగెత్తుకుంటూ సింహం వద్దకు వెళ్లింది.
పొద్దుటి నుంచి ఆహారం కోసం ఎదురు చూస్తున్న సింహం బాగా రుస రుసలాడుతూ, కోపంతో గుహ వాకిలో పచార్లు చేస్తోంది. కుందేలును చూడగానే ఏమిటి ఇంత ఆలస్యం అంటూ గర్జించింది. కుందేలు గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, క్షమించండి మహారాజా.. నేను పొద్దున్నే మీ వద్దకు రావటానికి బయలు దేరాను కానీ దారిలో ఇంకొక సింహం కనిపించింది. అది నన్ను తినబోతుంటే, ఈ రోజు నేను మీకు ఆహారాన్ని అన్న విషయం చెప్పాను. ఆ సింహం అస్సలు మాట వినలేదు. ఈ అడివికి నేనే రాజుని, అని నాతొ చెప్పి నా పైకి దూకి నన్ను పట్టుకుందామని ప్రయత్నించింది. నేను ఎలాగో ప్రాణాలు కాపాడుకుని మీ దెగ్గరకు వచ్చాను అని చెప్పింది.
అసలే కోపం మీద ఉన్న ఆ సింహానికి ఇంకా భగ్గున మండింది. ఎక్కడ ఆ సింహం.. చూపించు నాకు అంది. కుందేలు సింహాన్ని నూతి దగ్గరకు తీసుకుని వెళ్ళింది. మరో సింహం నూతి (బావి)లో ఉంటుందని చెప్పింది. సింహం నూతిలోకి చూసింది. నీళ్ళల్లో తన ప్రతిబింబం చూసి మరో సింహం అని అపోహ పడి గర్జించింది. ఆ గర్జన నూతిలో ప్రతిధ్వనించింది. సింహం తన ప్రతిబింబం తోనే యుద్ధం చేయడానికి నూతిలోకి దూకింది. లోతుగా ఉన్న నూతిలోకి దూకిన సింహం బయటకు వచ్చే మార్గం లేక మరణించింది. కుందేలు ప్రాణాలతో ఇలా తప్పించుకుంది. అడివిలో మిగిలిన జంతువులకు జరిగింది అంతా చెప్పింది కుందేలు. జంతువులన్నీ కుందేలు చాకచక్యం మెచ్చుకున్నాయి. ఆ రోజు నుంచి ప్రశాంతంగా అడవిలో నివసించాయి. బలం కన్నా బుద్ధి గొప్పది అని నిరూపించడానికి ఈ కథ ఉదాహరణగా నిలుస్తుంది.
Children’s Story: సోమరిపోతు నక్కకు తెలివిగా బుద్ది చెప్పిన కోతి | Pillala Kathalu