(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమెరికా అధ్యక్షుడు డౌనాల్డ్ ట్రంప్ రెండు గంటల్లో 123 సార్లు ట్వీట్ చేశారు. ట్విట్టర్పైనే జీవించే ట్రంప్కు కూడా ఇది రికార్డే. ఆయనకు అంత అవసరం ఏమొచ్చిపడింది? ఎందుకంత కలవరానికి గురయ్యారు? అమెరికా ప్రతినిధుల సభ ట్రంప్ను అభిశంసించడం తప్పదని తేలిపోయింది. అదీ విషయం. జ్యుడీషియల్ కమిటీ విచారణ జరిగినన్ని రోజులూ మేకపోతు గాంభీర్యం ప్రకటించిన ట్రంప్ చివరికి అభిశంసన తప్పదని తేలిపోయేసరికి ప్రత్యర్ధులపై విరుచుకుపడ్డారు.
అమెరికా అధ్యక్ష పదవి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన స్థానం. అంతటి శక్తివంతమైన పదవిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ను అక్కడి కాంగ్రెస్ (అమెరికా చట్ట సభలు) అభిశంసిస్తోంది. కారణం ఆయన మరో దేశాధ్యక్షుడికి చేసిన ఒక ఫోన్కాల్. ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి వచ్చే ఎన్నికలలో డెమొక్రాటికి పార్టీ అభ్యర్ధిగా తనతో పోటీ పడే అవకాశం ఉన్న జో బిడెన్ వ్యాపార కార్యకలాపాలపై విచారణ జరపాల్సిందిగా ట్రంప్ కోరారు. విచారణ జరపకపోతే అమెరికా నుంచి అందాల్సిఉన్న ఆర్ధిక సహాయం నిలిపివేస్తానని ట్రంప్ బెదిరించారన్నది ఆయనపై అభియోగం.
దీనిపై ట్రంప్ను అభిశంసించాలో లేదో తేల్చేందుకు ప్రతినిధుల సభ జ్యుడీషియల్ కమిటీ కొద్ది రోజులుగా విచారణ జరుపుతోంది. చివరికి రెండు అభియోగాలపై ఆయనను అభిశంసించాలని కమిటీ నిర్ణయించింది. డెమొక్రాట్లకు మెజారిటీ ఉన్న ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం నెగ్గిన పక్షంలో అది ఎగువ సభ అయిన సెనేట్కు వెళుతుంది. అక్కడ ట్రంప్ సొంతపార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ ఉంది. 240 పైచిలుకు ఏళ్ల చరిత్రలో అమెరికాను 43 మంది అధ్యక్షులు పాలించారు. వారిలో ఇంతవరకూ యాండ్రూ జాన్సన్, బిల్ క్లింటన్ ఇద్దరే అభిశంసన ఎదుర్కొన్నారు. వారిద్దరినీ చివరికి సెనేట్ క్షమించింది. ఇప్పుడు ట్రంప్ అభిశంసన ఎదుర్కొంటున్న మూడవ అధ్యక్షుడు.
‘నేను ఏ తప్పూ చేయనపుడు నన్ను అభిశంసించడం అన్యాయం. వామపక్షవాదులు, ఎందుకూ పనికిరాని డెమొక్రాట్లు విద్వేషంతో దీనికి పూనుకున్నారు. ఇది దేశానికి ఏమాత్రం మంచిది కాదు’s అని ట్రంప్ ట్వీట్ చేశారు. తాను దేశానికి అంతా మంచే చేశాననీ, బ్రహ్మాండంగా పాలించాననీ ఆయన చెప్పుకున్నారు. పనిలో పనిగా ఆయన తనకు గిట్టని మీడియాపై కూడా విరుచుకుపడ్డారు. ట్వీట్లు గానీ, రీట్వీట్లు గానీ రికార్డు స్థాయిలో మొత్తం 123 సార్లు చేశారు.