(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా సోము వీర్రాజు నియమితులు అయన తరువాత రాష్ట్రంలో బిజెపి దూకుడు పెరిగింది. బిజెపి మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చే క్రమంలో రాష్ట్రంలోని ఇతర పార్టీలకు, వివిధ సామాజిక వర్గాలకు కొమ్ముకాస్తున్న నాయకులను సోము వీర్రాజు కోరలు పీక్కుంటూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీని, ఆ సామాజిక వర్గాన్ని నైరాశ్యం చేసే క్రమంలో బిజేపిలో వారికి అనుకూలంగా ఎవరు ఉంటున్నారో గుర్తించి వాళ్ళందరినీ పార్టీ నుంచి బయటకు పంపుతూ, పొమ్మనలేక పొగ పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సోము వీర్రాజు తాజాగా నిన్న ప్రకటించిన 40మంది రాష్ట్ర కార్యవర్గంతో బిజెపిలో అంతర్గత సెగ రగులుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని జిల్లాలకు పూర్తిగా ప్రాతినిధ్యం లేకపోవడం, కొన్ని సామాజిక వర్గాలను పూర్తిగా పట్టించుకోకపోవడం, ముఖ్యంగా గతంలో అధ్యక్షుడుగా పని చేసిన కన్నా లక్ష్మీనారాయణ వర్గాన్ని పూర్తిగా పక్కకు పెట్టేయడం వెనుక సోము వీర్రాజుపై కొంత మంది బిజెపి శ్రేణులు రగిలిపోతున్నారు. అందుకే ఆయనపై కేంద్ర పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది.
రాబోయే 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన, బిజెపి జోడీగా అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని భావిస్తున్న బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు 40మంది నేతలతో సొంత టీమ్ను సిద్ధం చేసుకున్నారు. 40మందితో ఏర్పడిన ఏపి బిజెపి కొత్త టీమ్ లో పది మంది ఉపాధ్యక్షులు, పది మంది కార్యదర్శులు, అయిదుగురు ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. అయితే పార్టీ పట్ల అంకితభావంతో పని చేసే కొందరు నేతలకు రాష్ట్ర కమిటీలో స్థానం లభించకపోవడంతో నూతన కమిటీపై అప్పుడే అసంతృప్తి రాజుకుంటోందట. రాష్ట్ర కార్యవర్గంలో మరి కొందరికి అవకాశం కల్పించే వెసులుబాటు ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానంకు సోము వీర్రాజే చెప్పి కుదించారని బిజెపి వర్గాల టాక్. ప్రభుత్వ పదవులు నిర్వహిస్తున్న వారికి పార్టీలో పదవులు ఇవ్వడం పట్ల కూడా కొందరు తప్పుబడుతున్నారట. ఎమ్మెల్సీగా ఉన్న మాధవ్, నెహ్రూ యువ కేంద్రం వైస్ చైర్మన్గా ఉన్న విష్ణువర్థన్ రెడ్డి ప్రధాన కార్యదర్శుల పదవులు కట్టబెట్టిన సోము వీర్రాజు ప్రకాశం జిల్లాకు అసలు ప్రాధాన్యతే ఇవ్వలేదని అంటున్నారుట.
ప్రభుత్వం విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం వల్ల విశాఖ జిల్లాకు నూతన కార్యవర్గంలో అధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల సోము వీర్రాజు పరోక్షంగా మూడు రాజధానుల నిర్ణయానికి అనుకూల సంకేతాలు ఇచ్చినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. నూతన కార్యవర్గంలో చోటు లభించని వారు. అసంతృప్తితో ఉన్న నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి ఈ విషయాలను తీసుకువెళ్లాలని అనుకుంటున్నారుట. ఇప్పటికే కొందరు నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి అంతర్గతంగా ఫిర్యాదులు పంపుతున్నట్లు తెలుస్తోంది. అయితే సోము వీర్రాజుకు సంఘ్ బ్యాగ్రౌండ్ ఉన్న నేపథ్యం, నూతన కమిటీలోనూ ఆర్ఎస్ఎస్ నుండి ఎదిగిన వారికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ వ్యవహారంలో కేంద్ర బిజెపి పెద్దలు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?