అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారిగా సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. శక్ర, శనివారాల్లో సచివాలయంలో పరిపాలనా వ్యవహారాలు చూసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాక సందర్భంగా సచివాలయంలో సిఎం చాంబర్ను సరికొత్తగా ముస్తాబు చేశారు. వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి ఏర్పాట్లు దగ్గర ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు.
క్యాబినెట్ హాలు, హెలిపాడ్లతో పాటు, సిఎం కాన్వాయ్ రూట్లను సుబ్బారెడ్డి దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. సిఎం చాంబర్లో మార్పులు, చేర్పులు తదితర విషయాలను సుబ్బారెడ్డి నిశితంగా పరిశీలించారు. వైవి సుబ్బారెడ్డి ఆమోదించిన తర్వాతే మార్పులు, చేర్పులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
వైఎస్ జగన్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే సిఎంఒలో ప్రక్షాళన చేశారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పని చేసిన అధికారులను సాధారణ పరిపాలనా శాఖకు బదిలీ చేశారు.