అమరావతి: దేశచరిత్రలో టెండర్ల ప్రక్రియలో ఉత్తమ పారదర్శక విధానానికి వైయస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జ్యుడిషియల్ కమిషన్ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. టెండర్లలో పక్షపాతం, గందరగోళం, ప్రజా ధనం లూటీ, అవినీతి అడ్డుకట్టకు ఈ చట్టాన్ని తీసుకువస్తున్నట్లు మంత్రివర్గం పేర్కొంది.
బిల్లులో ప్రధాన అంశాలు: మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత, పారదర్శకతకు పెద్దపీట వేయడం.
హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో టెండర్ల పరిశీలన. అందరికీ సమాన అవకాశాలు, నాణ్యతా ప్రమాణాలు, ఖర్చువిషయంలో జాగ్రత్త పాటించడమే లక్ష్యాలుగా పేర్కొంది.
హైకోర్టు న్యాయమూర్తి లేదా విశ్రాంత న్యాయమూర్తి పరిధిలోకి 100 కోట్ల రూపాయలకు పైబడ్డ అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వెళతాయి. పనిని ప్రతిపాదిస్తున్న ప్రతిశాఖ ఆ పత్రాలను జడ్జికి సమర్పించాల్సిందే. టెండర్లను పిలవడానికి ముందుగానే అన్ని పిపిపి, జాయింట్ వెంచర్లు, స్పెషల్ పర్సస్ వెహికల్స్ సహా అన్ని ప్రాజెక్టులపైనా జడ్జి పరిశీలన చేస్తారు.
పనులను ప్యాకేజీలుగా విభజించినా సరే మొత్తం పనివిలువ 100 కోట్ల రూపాయలు దాటితే జడ్జి పరిధిలోకి రావాల్సిందే.
ఈ విషయంలో జడ్జికి సహాయంగా ప్రభుత్వం పలువురు నిపుణులను నియమిస్తుంది. అవసరమైన నిపుణులను జడ్జికూడా కోరవచ్చు. తొలుత వారం రోజులపాటు ప్రజలు, నిపుణుల పరిశీలనకు ప్రజా బాహుళ్యంలోకి పనుల ప్రతిపాదనలు వస్తాయి. ఆ తర్వాత ఎనిమిది రోజుల పాటు జడ్జి వాటిని పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందిస్తారు. ఈ విధానంలో మొత్తం 15 రోజుల్లో టెండర్ ప్రతిపాదన ఖరారు అవుతుంది. ఆ తర్వాతే బిడ్డింగ్ ఎవ్వరికీ అదనపు లబ్ధి చేకూర్చకుండా పారదర్శకంగా నిస్పక్షపాతంగా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అర్హత ఉన్న కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు లభిస్తాయని మంత్రి వర్గం పేర్కొంది.