న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ శుక్లాపై అవినీతి ఆరోపణల కేసు దాఖలు చేసేందుకు సిబిఐను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అనుమతించారు. ఇలా ఒక హైకోర్టు న్యాయమూర్తిపై సిబిఐ కేసు విచారణ జరగడం ఇదే మొదటిసారి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతి లేకుండా సిట్టింగ్ జడ్జిపై సిబిఐ కేసు పెట్టడం కుదరదు.
2017లో ఒక ప్రయివేటు మెడికల్ కాలేజికి అనుకూలంగా వ్యవహరించినట్లు జస్టిస్ శుక్లాపై వచ్చిన అవినీతి ఆరోపణలను న్యాయమూర్తిల కమిటీ ఒకటి పరిశీలించింది. ఆ ఆరోపణలను కమిటీ నిర్ధారించింది. దీనిపై విచారణకు సిబిఐ ప్రధాన న్యాయమూర్తి అనుమతి కోరింది.
జస్టిస్ శుక్లాపై అవినీతి ఆరోపణలు నిర్ధారణ అయిన తర్వాత అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శుక్లాను పదవికి రాజీనామా చేయాలనీ లేదా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలనీ కోరారు. అయితే జస్టిస్ శుక్లా ససేమిరా అన్నారు. దానితో జస్టిస్ శుక్లాపై పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా జస్టిస్ గొగోయ్ గత నెలలో ప్రధానమంత్రికి రాశారు.