హైదరాబాద్: ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత, సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్ జైపాల్రెడ్డి (77) అనారోగ్యంతో ఈ తెల్లవారుఝామున కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతూ గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాడుగులలో 1942 జనవరి 16న జన్మించిన జైపాల్రెడ్డి విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1975లో ఇందిరాగాంధీ విధించిన అత్యయక పరిస్థితిని వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసి జనతాపార్టీలో చేరారు. 1985నుండి 88వరకూ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 1980లో మెదక్ పార్లమెంట్ నుండి ఇందిరా గాంధీపై జైపాల్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.
1969లో తొలి సారిగా మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన జైపాల్ రెడ్డి వరుసగా నాలుగు సార్లు అదే నియోజకవర్గం నుండి విజయం సాధించారు. 1984లో మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం నుండి తొలి సారిగా పార్లమెంట్కు ఎన్నికయ్యారు. 1999,2004లో మిర్యాలగూడ నుండి ఎంపిగా గెలుపొందారు. 1990,1996లో రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికయ్యారు. 1991 జూన్ నుండి 1992వరకూ రాజ్యసభాపక్ష నేతగా వ్యవహరించారు. 1999నుండి 2000వరకూ సభా హక్కుల ఉల్లంఘన కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. ఐకే గుజ్రాల్, మన్మోహన్సింగ్ క్యాబినెట్లో కేంద్ర సమాచార ప్రసారశాఖ, పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పని చేశారు.
1998లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకొని దక్షిణాది నుండి తొలి సారి ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్న నేతగా గుర్తింపు పొందారు.
జైపాల్ రెడ్డి మృతి పట్ల ప్రధాని మోది, రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. యుపిఎ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఎఐసిసి నేత రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
రేపు అంత్యక్రియలు
జైపాల్ రెడ్డి అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆయన పార్ధివ దేహాన్ని గాంధీ భవన్కు తీసుకువస్తారు. ఉదయం 11గంటల వరకూ ప్రజలు, అభిమానుల సందర్శనార్థం అక్కడే ఉంచనున్నారు.
మాజీ ప్రధాని పివి ఘాట్ పక్కనే జైపాల్ రెడ్డి అంత్యక్రియలను నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. పివి ఘాట్ పక్కన స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపి రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం పరిశీలించారు.