చెన్నై: కేంద్రంలోని ఎన్డిఎ ప్రభుత్వం, తమిళనాడులోని అన్నాడిఎంకె ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయని నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ నేత కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. ముసాయిదా విద్యా విధానాన్ని విమర్శించినందుకు బిజెపి నుంచీ, అన్నాడిఎంకె నుంచీ దాడిని ఎదుర్కొంటున్న తోటి నటుడు సూర్యకు కమల్ బాసటగా నిలిచారు.
దక్షిణాది రాష్ట్రాలలో విద్యార్ధులకు హిందీ నేర్చుకోవడం తప్పనిసరి అని పేర్కొన్న ముసాయిదాను గత శనివారం సూర్య విమర్శించారు. హిందీని ఇక్కడ తప్పనిసరి చేయాలని చూడడంపై ప్రజలు ఆవేదనగా, ఆగ్రహంగా ఉన్నారని ఆయన అన్నారు.
దానిపై స్పందించిన తమిళనాడు మంత్రి కదంబూర్ రాజు, సూర్య వ్యాఖ్యలను తెలిసీతెలియని మాటల కింద కొట్టేశారు. విద్య గురించి ఏమీ తెలియని వారు విద్యా విధానం గురించి మాట్లాడుతున్నారని తమిళనాడు బిజెపి అధ్యక్షురాలు తమిళశాయి సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. ఆమె అనుచరుడు హెచ్ రాజా ఇంకాస్త ముందుకు వెళ్లి రాష్ట్రంలో శాంతియత వాతావరణాన్ని సూర్య చెడగొడుతున్నాడని ఆరోపించారు.
ఆ నేపధ్యంలో కమల్ హాసన్ సూర్యకు బాసటగా నిలిచారు. విద్యావిధానం గురించి మాట్లాడేందుకు సూర్యాకు అన్ని హక్కులూ ఉన్నాయని ఆయన అన్నారు. సూర్య కుటుంబం తమిళనాడులో విద్యారంగానికి చాలా సేవ చేసిందని కమల్ ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. సూర్య పేర్కొన్న చాలా అంశాలతో తాను ఏకీభవిస్తానని ఆయన తెలిపారు.
జూన్లో కేంద్రం విడుదల చేసిన ఈ విద్యా విధానం ముసాయిదాపై దక్షిణాది రాష్ట్రాలలో గగ్గోలు పుట్టింది. బిజెపి మిత్రపక్షమైన అన్నాడిఎంకె కూడా నిరసన తెలిపింది. ఫలితంగా హిందీ తప్పనిసరి అంటున్న నిబంధనను కేంద్రం తొలగించింది.