వాషింగ్టన్: పాకిస్థాన్ తమ దేశంలోని ఉగ్రవాద సంస్థల నిర్మూలనకు చర్యలు చేపట్టాల్సిందేనని అమెరికా స్పష్టం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను భారత వైమానిక దళాలు ధ్వంసం చేసిన మరుసటి రోజే అమెరికా ఈ మేరకు స్పందించడం గమనార్హం.
ఇరుదేశాల మధ్య చోటు చేసుకుంటున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ దేశాలు సంయమనం పాటించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ వర్గాలు కోరాయి. తిరిగి సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు కోసం కృషి చేయాలని సూచించాయి.
‘తాము ఉద్రిక్త పరిస్థితులు తీవ్రతరం కావాలని కోరుకోవడం లేదు. ఇండియా, పాకిస్థాన్ మధ్య సుహృద్భావ వాతావరణాన్ని కోరుకుంటున్నాం’ అని ఇరుదేశాల విదేశాంగమంత్రులతో మాట్లాడిన తర్వాత యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపీ వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీతో తాను మాట్లాడినట్లు పాంపీ తెలిపారు. ‘ప్రస్తుత తరుణంలో ఉద్రిక్తతను పెంచే మిలిటరీ చర్యలు లాంటివి తీసుకోకుండా.. దేశంలోని ఉగ్రవాద సంస్థల నిర్మూలనకు చర్యలు చేపట్టండి’ అని ఖురేషీకి సూచించినట్లు పాంపీ వెల్లడించారు.
మంగళవారం తెల్లవారుజామున 3.30గంటలకు పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళాలు బాంబుల వర్షం కురిపించాయి. దీంతో మూడు కీలక ఉగ్ర శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో సుమారు 350మంది ఉగ్రవాదులు హతమయ్యారు.