జగన్ సీఎం అయితే రాజధాని మారుతుందన్న ప్రచారం తమకు నష్టం కలిగిస్తుందని గ్రహించిన వైసిపి ఆ ఊహాగానాలకు తెర దించే ప్రయత్నం మొదలుపెట్టింది. తాము అధికారంలోకి వచ్చినా ఏపీ రాజధాని అమరావతిలోనే ఉంటుందని వైఎస్సార్సీపీ మ్యానిఫెస్టో కమిటీ అధ్యక్షుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంగళవారం స్పష్టం చేసారు. రాజధాని మారుతుందని చేస్తున్న ప్రచారాలని నమ్మవద్దన్నారు .అభివృద్ధి అంటే ఎలావుంటుందో అమరావతిలో చేసి చూపిస్తామన్నారు.
వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం విజయవాడలో జరిగింది. సమావేశం అనంతరం వైఎస్సార్సీపీ మ్యానిఫెస్టో కమిటీ అధ్యక్షుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. సమావేశంలో అందరి సూచనలు తీసుకున్నామన్నారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలు, నవరత్నాలు మ్యానిఫెస్టోలో ఉంటాయని తెలిపారు. అన్ని వర్గాల సమస్యలకు పరిష్కారాలు మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు.
ప్రస్తుత రాజధాని అమరావతి కొనసాగుతుందని, జగన్ అధికారం లోకి వస్తే రాజధాని మారుస్తారంటూ చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. అమరావతిని అభివృద్ధి చేసే విషయంలో ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు .ప్రత్యేక హోదా, విభజన హామీలు అన్ని మ్యానిఫెస్టోలో ఉంటాయని చెప్పారు .
మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలుచేసి చేతల ప్రభుత్వం అంటే ఎలావుంటుందో నిరూపించుకొంటామని తెలిపారు .
మార్చ్ 3 న కమిటీ సభ్యులు అన్ని జిల్లాల్లో వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారన్నారు. మార్చ్ 6 న మ్యానిఫెస్టో కమిటీ మరోసారి భేటి అవుతుందని చెప్పారు .