భారత వాయుసేన విమానాలు ఈ రోజు ఉదయం పాకిస్థాన్ భూభాగంలో ధ్వంసం చేసిన జైషె మొహమ్మద్ శిక్షణా శిబిరం చాలా పెద్దది. పది మిరేజ్ 2000 ఫైటర్ జెట్స్ వెళ్లి ఆ శిబిరంపై వెయ్యి కిలోల బాంబులు జారవిడిచాయి.
ధ్వంసమైన శిబిరం పాత చిత్రాలను ప్రభుత్వ వర్గాలు విడుదల చేశాయి. ఈ శిబిరంలో 600 మందికి వసతి సౌకర్యం ఉంది. బాల్కోట్లోని ఈ శిబిరం పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇందులో ఒక ఫైరింగ్ రేంజ్, ఒక ఈత కొలను, ఒక జిమ్నాజియం కూడా ఉన్నాయి. ఒక కొండపైన దట్టమైన అడవి మధ్య దీనిని నిర్మించారు.
జైషె మొహమ్మద్ సభ్యులకు శిక్షణ అందించే హాలును ఆ టెరరిస్టు సంస్థ పోస్టర్లతో జెండాలతో అలంకరించారు.
ఒకచోట మెట్ల మార్గాన్ని అమెరికా, ఇజ్రాయెల్, ఇంగ్లండ్ దేశాల జెండాలతో అలంకరించారు. అంటే ఆ మార్గంలో నడిచేవారు ఆ జెండాలను తొక్కుకుంటూ నడుస్తారన్న మాట.
ఈ కేంద్రం పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రత్యక్ష పర్యవేక్షణలో నడుస్తుంది. సుమారు 250 మంది టెరరిస్టులకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు.
మందుగుండు నిల్వ చేసిన ఒక డంప్ కూడా ఇక్కడ ఉంది.
జైషె మొహ్మమ్మద్ అధినేత మసూద్ అజర్ బావ మౌలానా యూసఫ్ అజర్ అలియాస్ ఉస్తాద్ ఘౌరీ ఈ కేంద్రం నాయకుడు. అతను ప్రయాణించే వాహనం ఫొటో కూడా ప్రభుత్వం విడుదల చేసింది.
Photo courtesy: ND Tv