భారత సంతతి చిన్నారికి జనన ధ్రువీకరణ
జెడ్డా: దొంగతనం చేస్తే చేతులు నరికేస్తారు.. ఇంకా పెద్ద నేరాలు చేస్తే నడిరోడ్డులో అందరూ చూస్తుండగానే ఉరి తీస్తారు, లేదా అవసరమైతే తల కూడా నరికేస్తారు. ఇంతటి కఠినమైన చట్టాలు యూఏఈలో ఉంటాయి. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా చిన్న పని కూడా చేయడానికి వీల్లేదు. అత్యాధునిక కాలంలో కూడా ఇలాంటి చట్టాలను అక్కడ అమలు చేస్తుంటారు. కానీ, ఒక చిన్నారి విషయంలో అంతటి కఠినాత్ముల మనసు కూడా కరిగిపోయింది. తొలిసారి తమ నిబంధనలను కాసేపు పక్కన పెట్టి అక్కడి యంత్రాంగం వ్యవహరించింది. భారత సంతతికి చెందిన ఒక పాపకు జనన ధ్రువీకరణ పత్రం మంజూరుచేసింది.
యూఏఈ వివాహచట్టాల ప్రకారం ఇస్లాం మతానికి చెందిన మగవాళ్లు వేరే మతాలకు చెందిన ఆడవాళ్లను పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఇస్లాం మతానికి చెందిన మహిళలను మాత్రం వేరే మతం వాళ్లు పెళ్లి చేసుకోడానికి వీల్లేదు. ఒకవేళ వేరే దేశానికి చెందినవాళ్లు ఎవరైనా అలా పెళ్లి చేసుకున్నా కూడా.. వారికి యూఏఈలో పుట్టే పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రం మంజూరు చేయరు.
భారతదేశానికి చెందిన కిరణ్ బాబు అనే వ్యక్తి కేరళకు చెందిన సనామ్ సాబూ సిద్దిక్ అనే మహిళను 2016లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ ఉద్యోగాల కోసం యూఏఈ వెళ్లారు. 2018లో ఆమె తల్లయింది. కానీ వారి వివాహం యూఏఈ చట్టాలకు విరుద్దంగా ఉండటంతో వాళ్లకు పుట్టిన పాపకు జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి కుదదరదని అధికారులు తొలుత చెప్పారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కిరణ్ బాబు దంపతులకు పరిష్కారం మాత్రం దొరకలేదు. వాళ్ల ప్రయత్నాలు అలా ఉండగానే.. 2019 సంవత్సరాన్ని సహన సంవత్సరంగా యూఏఈ ప్రకటించింది. దీంతో, తమ పాపకు ఈ సందర్భంగానైనా న్యాయం చేయాలని కిరణ్ దంపతులు అక్కడి కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం స్పందించింది. దేశచరిత్రలో తొలిసారి తమ నిబంధనలను పక్కన పెట్టి కిరణ్ బాబు దంపతులకు పుట్టిన పాపకు జనన ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. దీంతో పుట్టిన తొమ్మిది నెలల తర్వాత ఆ పాపకు అనాంత ఏస్ లీన్ కిరణ్ అనే పేరు పెట్టారు. ఇదే పేరుతో అధికారులు జనన ధ్రువీకరణ పత్రాన్ని కూడా ఇచ్చేశారు. దాంతో ఇప్పుడా పాప యూఏఈ పౌరురాలు అయింది.