17 రోజుల తర్వాత లోయలో కనిపించిన మహిళ
అమందా ఎల్లర్ సరదాగా సాయంత్రం నడుచుకుంటూ అలా వెళ్దామని బయల్దేరారు. హవాయి ప్రాంతంలోని ఓ దట్టమైన అడవిలోకి అలా వెళ్లిపోయారు. రెండు వారాల వరకు ఆమె ఏమయ్యారో ఎవరికీ తెలియలేదు. ఆ తర్వాత 15 రోజులకి ఒళ్లంతా పేలిపోయి, నవ్వుతూ బయటకు వచ్చారు. హవాయిలో నివసించే ఎల్లర్ (35) ఫిజికల్ థెరపిస్టుగాను, యోగా టీచరుగాను పనిచేస్తుంటారు. తన కారును మకావో అటవీ ప్రాంతంలో పార్కు చేసి, తన తాళాలు, ఫోను, వాలెట్ అన్నీ అక్కడే ఉంచేసి మరీ నడిచేందుకు వెళ్లారు. మే 8వ తేదీ నుంచి ఆమె కనపడకుండా పోయారు. దాంతో ఆమె ఆచూకీ కోసం అనేక మంది వలంటీర్లు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగించారు.
ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించాయి. చివరకు ఆమె కుటుంబ సభ్యులు ఒక హెలికాప్టర్ గాలింపు బృందాన్ని నియమించగా.. వాళ్ల సాయంతో ఆమెను కారు నుంచి నాలుగు మైళ్ల దూరంలో కనుగొన్నారు. అక్కడి చెట్ల ఆకులు, కాయలు తింటూ.. నీళ్లు తాగుతూ ఆమె ప్రాణాలు కాపాడుకున్నట్లు ఎల్లర్ స్నేహితులు కేఐటీవీకి తెలిపారు. ఆ అటవీ ప్రాంతం నుంచి ఆమెను ఆసుపత్రికి హెలికాప్టరులో తీసుకెళ్లారు.
తన కూతురు చాలా తెలివైనది, ధైర్యం ఉన్నది, అన్ని రకాల పరిస్థితులను తట్టుకోగలదని.. ఆ విషయం తాము మొదట్లోనే చెప్పామని, అదే ఇప్పుడు నిజమైందని ఎల్లర్ తండ్రి జాన్ ఎల్లర్ తెలిపారు. అడవిలోకి సరదాగా నడుకుని వెళ్తూ, వెనక్కి తిరిగి వచ్చేటపుడు దారి తప్పిపోయిందని ఆయన అన్నారు. దట్టమైన అడవిలో ఒక లోయలో ఆమెను కనుగొన్నారని, వాళ్లు అక్కడినుంచి తాళ్త సాయంతో పైకి లాగారని వివరించారు. కాళ్లకు బూట్లు, సాక్సులు కూడా లేని పరిస్థితుల్లో ఆహారం కోసం వెతుకులాడుకుంటూ కనిపించారని గాలింపు బృందానికి చెందిన ట్రాయ్ హెల్మర్, జేవియర్ కాంటెలాప్స్, క్రిస్ బెర్క్విస్ట్ చెప్పారు. ఆమె ఫొటోను రోజుకు వందసార్లు చూసేవాడినని, ఆమెను గుర్తుపట్టడానికి అది బాగా ఉపయోగపడిందని బెర్క్విస్ట్ అన్నారు. ఆమెను గుర్తించడానికి కంగారు పడలేదని, జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్లామని చెప్పారు. దాదాపు 20 పౌండ్ల బరువు తగ్గారని హెల్మర్ అన్నారు. ఆమెకు ఒళ్లు చీరుకుపోయి, ఎండకు చర్మం పేలిపోయింది గానీ ఎక్కడా ఎముకలు మాత్రం విరగలేదని ఆమె తండ్రి చెప్పారు. ఆమె పాదాలు వాచి ఉండగా, కాళ్ల మీద బొబ్బలు కనిపించాయి.