అమరావతి: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎంపి జెసి దివాకరరెడ్డి ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు వైసిపి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో 1985నుండి 2009వరకూ వరుసగా ఆరు సార్లు జెసి దివాకరరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం జెసి దివాకరరెడ్డి కుటుంబం టిడిపిలో చేరింది. 2014లో ఆయన సోదరుడు ప్రభాకరరెడ్డి టిడిపి నుండి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి టిడిపి అభ్యర్థి జెసి అస్మిత్ రెడ్డిపై 7511 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.
ఈ నేపథ్యంలో తాడిపత్రి మున్సిపాలిటీలో వైసిపిని బలోపేతం చేసే క్రమంలో భాగంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన కేతిరెడ్డి పెద్దారెడ్డి అనూహ్య నిర్ణయాన్ని నేడు ప్రకటించారు. ఈ నెల 20వ తేదీ నుండి తలుపులు తెరుస్తామనీ, ఎవరైనా పార్టీలో చేరవచ్చని కేతిరెడ్డి ప్రకటించారు. పార్టీలో చేరేందుకు ఎవరి మధ్యవర్తిత్వం, సిఫార్సులు అవసరం లేదని కూడా కేతిరెడ్డి అన్నారు. నేరుగా తన వద్దకు వచ్చి పార్టీలో చేరవచ్చని కేతిరెడ్డి ప్రకటించారు. కేవలం తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో నివసించే వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించామని కేతిరెడ్డి తెలిపారు.
జూలై అయిదవ తేదీ నుండి తాడిపత్రిలో మట్కా కనబడకూడదని పోలీసులను కేతిరెడ్డి హెచ్చరించారు. పోలీసులు మట్కాను అరికట్టలేకపోతే వైసిపి తరపునే వార్డుకు ముగ్గురు నుండి ఐదుగురిని నియమించి మట్కా రాసేవారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగిస్తామని కేతిరెడ్డి చెప్పారు. వైసిపి పేరుతో బెదిరింపులకు దిగుతున్నారని మాజీ ఎంపి జెసి తనయుడు జెసి పవన్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కేతిరెడ్డి అన్నారు. ఈ ప్రాంతంలో గతంలో ఎవరు బెదిరింపులకు పాల్పడేవారో అందరికీ తెలుసునని కేతిరెడ్డి పేర్కొన్నారు.