వైసీపీ రెబల్ ఎంపి రఘు రామకృష్ణం రాజు వ్యవహారం అందరికీ తెలిసిందే. ప్రభుత్వాన్ని, అధికార వైకాపా నేతలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసిన కారణంగానే ఆయనను పార్టీ నుండి, ఎంపి పదవి నుండి సాగనంపాలని పార్టీ అధిష్టానం కంకణం కట్టుకుందని అందరూ భావిస్తున్నారు. అయితే రఘురామ కృష్ణంరాజుపై వేటుకు మరొక కీలక కారణం ఉందని ఇప్పుడు ప్రచారం జరుగుతున్నది. ఏపితో సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో మతమార్పిడిలు జరుగుతున్నాయని, క్రైస్తవ సంఘాలకు పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయంటూ ఎంపి రఘురామ కృష్ణంరాజు ఇటీవల ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అయన వ్యాఖ్యలను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సువార్తకుడు కేఏ పాల్ తప్పు పట్టారు. రాజు వ్యాఖ్యలను పాల్ ఖండిస్తూ అయన దీనిపై క్షమాపణ చెప్పాలని లేకుంటే వైసీపీ నుండి ఆయనను సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో క్రైస్తవ మత పెద్దల ఒత్తిళ్ల కారణంగానే రఘురామ కృష్ణంరాజు పై వేటుకు వైకాపా సిద్ధపడిందని ప్రచారం జరుగుతున్నది.
రఘురామకృష్ణంరాజు కధ వెనుక రాజకీయ అంశాల కంటే.. మతకోణమే ఉందని ఆయన వర్గీయులు, హిందూ సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి వాదనకు మద్దతుగా కేఏ పాల్ విడుదల చేసిన వీడియోను సాక్ష్యంగా చూపుతున్నారు. రఘురామ కృష్ణం రాజును పార్టీ నుంచి డిస్మిస్ చేయాలని వైకాపాను తాను డిమాండ్ చేశా, ఇప్పుడేమైంది? నేను చెబుతున్నవే జరుగుతున్నాయా? లేదా? ఇప్పటికయినా ఆయన మతమార్పిడి బిల్లు తీసుకురావాలని చేస్తున్న వాదనలో మార్పు రావాలని అని కేఏపాల్ అన్నారు. దీనిపై అయన అమెరికా నుంచి పంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మత మార్పిడులపై రాజు గారు ఏమన్నారంటే..
‘జనాభా లెక్కల ప్రకారం ఏపీలో క్రిస్టియన్ల శాతం 2.5 మాత్రమే. కానీ తెలుగు రాష్ట్రాల్లో వారి అనధికారిక సంఖ్య 25 శాతం. విదేశీ మిషనరీల నుంచి మతమార్పిళ్లకు లెక్కలేనంత నిధులు వస్తున్నాయి. మతం మారిన వారంతా ఆదివారం చర్చిలకు వెళుతున్నారు. ప్రార్ధనలు చేస్తుంటారు వారు తాము మతం మారినట్లు ఎక్కడా చెప్పకుండా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. వారు నిజంగా మతం మారితే, రాజ్యాంగం కల్పించిన అన్ని సౌకర్యాలు కోల్పోతారు. ప్రధానంగా వారికి రిజర్వేషన్లు వర్తించవు. అందుకే చెప్పడం లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. వారంతా బీసీ సీ కేటగిరీ కిందకు వస్తారు. ఇలాంటి మతమార్పిళ్లు ఒక్క ఏపీ, తెలంగాణలోనే కాదు. దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఏపీలో అధికంగా జరుగుతున్నాయి. వాటిని నిరోధించాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వాల బాధ్యత. మతం మారిన వారికి రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించకూడదన్న.. రాజ్యాంగ సూత్రాన్ని పకడ్బందీగా అమలు చేయాలంటే, మతమార్పిడి నిరోధక చట్టం తీసుకురావాలంటున్న కోట్లాది మంది భారతీయులు, హిందువుల్లో ఒకడిగా కోరుతున్నా. నేను ఏ కులానికి, మతానికి వ్యతిరేకం కాదు. రాజ్యాంగం ప్రకారమే మాట్లాడుతున్నా’ అని టీవీ ఇంటర్వ్యూలో రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.
ఆ కారణమో ఈ కారణమో గానీ ఎంపి రఘు రామ కృష్ణం రాజు భవితవ్యం లోక్ సభ స్పీకర్ చేతిలో ఉంది. రఘురామ కృష్ణం రాజుపై వైసీపీ చర్యలకు ఉపక్ర మించిన వేళ.. కేఏ పాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం మరో చర్చకు దారితీసింది.