అమరావతి: గ్రామ సచివాలయం ఉద్యోగాలు వైసిపి కార్యకర్తల కోసమని ఆ పార్టీ నేత విజయసాయి రెడ్డి చెప్పిన వీడియో బయటకు వచ్చింది. దీనిపై వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్రంగా స్పందించారు.
వైసిపి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే పార్టీ కోసం కష్టపడిన లక్షలాది మంది కార్యకర్తలకు న్యాయం చేశామని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దాదాపు మూడు లక్షల మంది గ్రామ పంచాయతీ వాలంటీర్లను ప్రభుత్వం నియమిస్తే అందులో 90 శాతం వైసిపి కార్యకర్తలనే ఎంపిక చేశామని పేర్కొనడం విపక్షాలకు అస్త్రంగా మారింది.
ఇప్పటికే రాష్ట్రంలో గ్రామ సచివాలయ పరీక్షల పేపరు లీకేజీ వ్యవహారం పెద్ద దుమారాన్నే రేపింది. ఎపిపిఎస్సి ఉద్యోగుల కుటుంబాల సభ్యులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వారి సన్నిహితులే అత్యధిక మార్కులు సాధించినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.
పేపరు లీకేజీ అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో గ్రామ సచివాలయ పోస్టులకు నిర్వహించిన పరీక్షలను రద్దు చేయాలనీ, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలనీ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు.
గ్రామ, వార్డు పరీక్షల లీక్ ఆరోపణలు కలవరపెడుతున్నాయనీ, ప్రభుత్వం స్పందించి వెంటనే విచారణకు ఆదేశించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై ఆదివారం టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘పేపరు లీక్ అయింది అని మేము అనడం కాదు. శకుని మామా మాటల ద్వారానే నిజాన్ని బయట పెట్టావు. గ్రామ వాలంటీర్లు అందరూ వైసిపి కార్యకర్తలే అని చెప్పావు. ఇప్పుడు గ్రామ సచివాలయం పోస్టుల్లో కూడా స్కామ్ జరిగింది అని బయట పడ్డావు. పేపరు దొంగతనం మీ దొంగబ్బాయ్ జగన్కి కొత్తకాదు. కాకపోతే ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే అక్రమాస్తుల కేసులో కాకుండా దొంగబ్బాయ్ని మరో సారి పేపరు లీక్ కేసులో జైలుకి పంపాలని శకుని మామ ఫిక్స్ అయ్యారు’ అని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.
పేపర్ లీక్ అయ్యింది అని మేము అనడం కాదు శకుని మామా @VSReddy_MP మీ మాటల ద్వారానే నిజాన్ని బయట పెట్టావు. గ్రామ వాలంటీర్లు అందరూ వైకాపా కార్యకర్తలే అని చెప్పావు, ఇప్పుడు గ్రామ సచివాలయం పోస్టుల్లో కూడా స్కాం జరిగింది అని బయట పడ్డావు. pic.twitter.com/PmRLLTpEm8
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) September 22, 2019