ప్రస్తుతం కరోనా విజృంభస్తున్న నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలు లాక్ డౌన్ కారణంగా మూసివేశారు. అయితే కొన్ని కార్పొరేట్ స్కూల్, కాలేజీ లు ప్రస్తుతం ఆన్లైన్ క్లాస్ ల ద్వారా తరగతి గదులను నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ తరగతులు నిర్వహించాలంటే స్మార్ట్ ఫోన్లు, లాప్టాప్ లు, ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉండాలి. ఈ సదుపాయాలన్నీ ఉన్నవారు ఎలాంటి డోకా లేకుండా, ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు. మరి సదుపాయాలు లేని వారి పరిస్థితి ఏమిటి? అలాంటి వారికోసం ఒక వినూత్నమైన ఆలోచన చేశారు జార్ఖండ్ కు చెందిన ఉపాధ్యాయులు. వారు చేసిన ఈ ఆలోచన తెలిస్తే, అందరూ ఫిదా అవ్వాల్సిందే. మరి ఆలోచన ఏమిటి? వారి ఎలాంటి సౌకర్యాలు లేకుండా తరగతులను ఎలా నిర్వహించారో ఇప్పుడు తెలుసుకుందాం..
జార్ఖండ్ లోని దుమ్కా జిల్లాలోని దుమర్దార్ గ్రామం ఎంతో వెనుకబడిన గ్రామం. ఆ గ్రామంలో ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు ఎలాంటి ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు సౌకర్యం లేదు. కానీ అక్కడ విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని, ఉపాధ్యాయులకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఈ కరోనా సమయంలో పిల్లల్ని స్కూల్ కు పంపించరు. కాబట్టి వారి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేశారు. అంతే ఆలోచన కాస్త అద్భుతం అయ్యింది.
ఆ వూరి వీధులలో భౌతిక దూరం పాటిస్తూ, ఆ ఇల్లు గోడలని బ్లాక్ బోర్డ్ గా తయారు చేసుకుని తమ పిల్లలను కూడా అందరితో పాటే చదువులో వెనుక పడకూడదని ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నం విజయవంతమైంది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ, ఆ వూరి వీధులే పాఠశాలలై, ఇంటి గోడలు బ్లాక్ బోర్డులుగా మర్చి అక్కడ విద్యార్థులు చదువు నేర్చుకుంటున్నారు. వారికి ఉపాధ్యాయులు మైకుల ద్వారా పాఠాలు నేర్పుతున్నారు.
ఈ ఆలోచనతో విద్యార్థులు స్కూల్ కి వెళ్లి కరోనా బారిన పడతారేమో అన్న భయం లేకుండా ఇంటి దగ్గరే చదువు నేర్చుకోవడం, వారిని విద్యావంతులను చేయడం ఎంతో ఆనందంగా ఉందని, విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇంతటి అద్భుతమైన ఆలోచన టీచర్లకు రావడం ఎంతో గర్వించదగ్గ విషయమని, ప్రతి ప్రాంతంలో కూడా ఇలాంటి సదుపాయాలతో విద్యార్థులకు తరగతులు నిర్వహించడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు.