(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఆత్మనిర్భర భారత్లో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు కొత్త పథకాన్ని ప్రకటించారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన పథకాన్ని కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన చిరుద్యోగుల కోసం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. నెలకు 15 వేలు కన్నా తక్కువ వేతనంతో ఇపిఎఫ్ నమోదిత ఉద్యోగంలో ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. 2020 అక్టోటర్ ఒకటవ తేదీ నుంచి అమలులోకి వస్తుందని, రెండేళ్లపాటు కొనసాగుతుందని మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు.
కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కోలుకోంటోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా అన్నారు. కోవిడ్ తరువాత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందనీ, దీంతో పాటు పలు రంగాలు కూడా గాడిలో పడుతున్నాయని అన్నారు. మూడో త్రైమాసికంలో వృద్ధి రేటు పెరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 1.05లక్షల కోట్లు దాటిన విషయాన్ని గుర్తు చేశారు. గతేడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఇది పది శాతం అధికమని తెలిపారు. స్టాక్ మార్కెట్లు రికార్డులు సృష్టిస్తున్నాయని అన్నారు. బ్యాంకు రుణాలు కూడా 5.1 శాతం పెరిగాయని తెలిపారు. విదేశీ పెట్టుబడులు 13శాతం పెరిగాయనీ, 35.37 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్బర భారత్ అభియాన్ పథకం సత్పలితాలు ఇచ్చిందని అన్నారు.