TTD New Board: ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత కీలకమైన నామినేటెడ్ పదవి విషయంలో సందిగ్ధత నెలకొంది.. టీటీడీ చైర్మన్ పదవిని జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డికి మరోసారి ఇస్తారా..!? మరో నాయకుడికి కేటాయిస్తారా..!? అనే సందేహాలు నెలకొన్నాయి. సీఎం జగన్ మదిలో ఎవరున్నారు..? ఎప్పుడు భర్తీ చేయనున్నారు..!? బోర్డు సభ్యులుగా ఎవరెవరికి అవకాశం ఇవ్వనున్నారు..!? అనేది సర్వత్రా చర్చనీయాంశం అయింది. పాలకమండలి అధ్యక్షుడితో పాటూ… దాదాపు 15 మంది సభ్యులను కూడా నియమించాల్సి ఉంది.
TTD New Board: వైవీకి కొనసాగింపు అవకాశాలు.. కానీ..!?
రెండేల్లపాటూ టీటీడీ చైర్మన్ గా పని చేసిన జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డికి మరో ఏడాది కూడా అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తుంది. వచ్చే ఏడాది జూన్ వరకు వైవీని కొనసాగించి ఆ తర్వాత ఒక బీసీ నాయకుడికి ఇస్తే బాగుంటుంది అని సీఎం జగన్ యోచిస్తున్నారట. కాకపోతే వైవీ ఆలోచన మరోలా ఉంది. టీటీడీ చైర్మన్ గా నామినేటెడ్ పదవిలో ఉంటూ ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. సొంత జిల్లాకు దూరమయ్యారు. సొంత క్యాడర్ ని వదులుకున్నారు. సొంత ప్రభుత్వ వచ్చినా తన వాళ్లకి న్యాయం చేయలేకపోయాను అనే అంతర్మథనంలో ఉన్నారు. అందుకే ఆయన మంత్రిగా చేయాలని అనుకుంటున్నారట. ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి, మంత్రిగా అవకాశం ఇవ్వాలని కూడా జగన్ ని కోరినట్టు తెలుస్తుంది. అయితే కొన్ని సామజిక సమీకరణాలు.., పార్టీ అంతర్గత అవసరాల దృష్ట్యా వైవీ టీటీడీకి మరో ఏడాది చైర్మన్ గా ఉంటూ.. ఆ తర్వాత రాజ్యసభకు పంపించాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. వైవీ విషయంలో ఏం జరగనుంది అనేది మరో వారంలో స్పష్టత రానుంది. ఒకవేళ ఆయనకు కొనసాగింపు ఇవ్వకుంటే మంత్రిగా అవకాశం ఇవ్వనున్నట్టు భావించవచ్చు.
ఒకవేళ వైవీ కాదంటే ఎవరెవరు..!?
ఒకవేళ వైవీ సుబ్బారెడ్డికి కొనసాగింపు ఇవ్వకుంటే మాత్రం ఆశావహుల జాబితా పెద్దదే ఉంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా.. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన బీసీ నేత బీదా మస్తానయ్య.., నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకుడు.., మరో రాజు… ఇలా పలువురు ఆశావహులు ఉన్నారు.
* చైర్మన్ సంగతి అలా ఉంటె.. ఇక 15 మంది సభ్యుల విషయంలో కూడా ఆశావహుల జాబితా పెద్దదే ఉంది. మాజీ ఎమ్మెల్యేలు, మంత్రి పదవి దక్కని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జిలు అనేక మంది లైన్లో ఉన్నారు. మొత్తం 15 మందిలో నాలుగు రెడ్డి, నాలుగు బీసీ, ఒకటి లేదా రెండు కమ్మ, రెండు కాపు, ఒకటి రాజులకు, ఒకటి ఎస్సైలకు ఇవ్వాలని జగన్ యోచిస్తున్నారని తెలుస్తుంది. ఈ లెక్కన కూడా సామజిక సమీకరణాల వారీగా ఆశావహులు గట్టిగానే ఉన్నారు.
* జగన్ మదిలో మాత్రం విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారట. అలాగే క్షత్రియ సామాజికవర్గంలో ఇటీవల పార్టీ పట్ల భిన్న వాదనలు రావడంతో వారికి టీటీడీలో సముచిత స్థానం ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ లు ఇద్దరూ మంత్రి పదవి ఆశిస్తున్నారు. వారిలో ఒకరికి మంత్రి పదవి, ఒకరికి టీటీడీ బోర్డు సభ్యుడు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇలా జిల్లాల వారిగా, సామాజికవర్గాల వారీగా సున్నితమైన లెక్కలున్నాయి.
* ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు టీడీపీ నుండి వైసీపీ లోకి వచ్చేసారు. ఏదో ఒక పదవి ఆశిస్తున్నారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు కూడా టీడీపీ నుండి వచ్చారు. ఆయనకు సముచిత స్థానం ఇవ్వాలంటే ఏదో ఒక పదవి ఇవ్వాలనేది పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నుండి వలస వచ్చిన వారికి పదవుల్లో అంత ప్రాధాన్యత అవసరం లేదని సీఎం జగన్ మొదటి నుండి ఫిక్సయినట్టు తెలిస్తుంది. అందుకే ఈ జిల్లా నుండి ఈ ఇద్దరి కంటే మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల్లో ఒకరికి అవకాశం దక్కనున్నట్టు సమాచారం. అయితే చైర్మన్ గా వైవీ ఇదే జిల్లా వారు కాబట్టి… సభ్యుడిని ఈ జిల్లా నుండి నియమించకపోవచ్చు.