Vijaya Shanthi: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కేసిఆర్ సర్కార్ విద్యాసంస్థలు పునః ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలతో సెప్టెంబర్ 1వ తేదీ నుండి తెలంగాణలో విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ బీజేపీ మహిళా నేత విజయశాంతి కామెంట్స్ చేశారు. కోవిడ్ తగ్గిందంటూ పాఠశాలలు తెరిచేందకు రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న దూకుడు చూస్తుంటే పాలకులకు విద్యార్థుల భవిష్యత్తుపై ఏ మాత్రం పట్టింపు లేదన్నట్లు అర్ధం అవుతోందన్నారు.
Read More: Vijaya Sai Reddy: విజయసాయి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి
వర్షాలకు తరగతి గదులు దెబ్బతిన్నాయి
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో లాక్ డౌన్లు విధించడంతో అనేక పాఠశాలల్లో ఫర్నిచర్ పాడైపోయిందనీ, వర్షాలకు తరగతి గదుల గోడలు, పైకప్పు దెబ్బతిని ప్రమాదకరంగా తయారు అయ్యాయన్నారు విజయశాంతి. ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలల్లో తాగునీరు, మురుగుదొడ్ల సదుపాయాలు కూడా కరువైనట్లు ఉస్మానియా యూనివర్శిటీ మాజీ డీన్ వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. అనేక ప్రాంతాల్లో కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో పాఠశాలలకు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారని తెలిపారు.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం పాఠశాలలను తెరిచేందుకు వారం రోజులు కూడా సమయం లేదనీ, ప్రాధమిక సౌకర్యాల పరిస్థితులు చక్కదిద్దకుండా పిల్లలను పాఠశాలలకు రప్పిస్తే వారు చదువుకునే పరిస్థితి ఉందా అని విజయశాంతి ప్రశ్నించారు. అగ్రరాజ్యం అమెరికాలో కూడా విద్యాసంస్థలు తెరిచిన తర్వాత విద్యార్థుల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయని విజయశాంతి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతే పాఠశాలలను తెరవాలని తల్లిదండ్రులతో సహా అందరూ కోరుకుంటున్నారని తెలిపారు. ఇవేమీ పట్టించుకోకుండా తెలంగాణ పాలకులు ముందుకు వెళితే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని విజయశాంతి హెచ్చరించారు.
కేసిఆర్ సర్కార్ విధానాలపై తరచు సోషల్ మీడియా వేదికగా విజయశాంతి విమర్శలు, ఆరోపణలు చేస్తుండటం తెలిసిందే. ఇప్పుడు తాజా పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ అంశంపై విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విజయశాంతి కామెంట్స్ పై కేసిఆర్ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.