అద్వానీ, జోషీలతో అమిత్ షా భేటీ
న్యూఢిల్లీ: బీజేపీ నష్టనివారణ చర్యలు మొదలుపెట్టింది. కురువృద్ధులు అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటివాళ్లను కూరలో కర్వేపాకులా తీసిపారేశారనన విమర్శలను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత వెంటనే పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నేరుగా అద్వానీ, మురళీ మనోహర్ జోషిల ఇళ్లకు వెళ్లారు. తమ వయసు కారణంగా ఎన్నికలలో పోటీచేసే అవకాశం దక్కకపోవడంతో అగ్రనేతలిద్దరూ తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. గురువులను పక్కన పెట్టేశారంటూ ప్రతిపక్షం నుంచి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో వారిని బుజ్జగించి మళ్లీ తెరపైకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
మేనిఫెస్టో విడుదలకు ముందే అమిత్ షా వారి వద్దకు వెళ్లి వారికి ఒక్కో కాపీ ఇస్తారని ప్రచారం జరిగినా, ఆయన మాత్రం అలా చేయలేదు. అయితే షా మాత్రం.. పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం మేరకే 75 ఏళ్లు దాటినవారికి పోటీ అవకాశం ఇవ్వలేదన్న విషయాన్ని స్వయంగా వివరించేందుకే వెళ్లినట్లు తెలుస్తోంది. స్వయంగా పార్టీ అధ్యక్షుడే వచ్చి చెప్పినందున ఇక నాయకులిద్దరూ వచ్చి ప్రచారంలో పాల్గొనడం లేదా.. కనీసం పార్టీ వేదికపై మాట్లాడటం లాంటివి ఉంటాయేమోనని భావిస్తున్నారు. వాళ్లిద్దరూ పార్టీ వ్యవస్థాపక సభ్యులు. 2014 ఎన్నికల్లో కూడా ఇద్దరూ 75 ఏళ్లు దాటినా, అప్పటికీ నిషేధం ఉన్నా అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచారు. తాను గాంధీనగర్ నుంచే పోటీ చేస్తానని అద్వానీ (91)కి అమిత్ షా గత నెలలో సందేశం పంపారు. జోషి అయితే తాను కాన్పూర్ లేదా మరెక్కడా పోటీ చేయడానికి వీల్లేదని పార్టీ ఆదేశించినట్లు కాన్పూర్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
పార్టీ తమను అవమానకరంగా పంపిందన్నది ఇద్దరి ఆవేదన. ఒకవేళ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే పార్టీ అధ్యక్షుడి లాంటివాళ్లు వచ్చిచెప్పాలని, దానికి బదులు ప్రధాన కార్యదర్శి రాంలాల్ వచ్చి చెప్పారని అన్నారు. అద్వానీ ప్రజల్లోకి నేరుగా వెళ్లలేదు గానీ గత వారం బ్లాగ్ ద్వారా ఓ సందేశం పంపారు. విమర్శకులను పార్టీ ఎప్పుడూ జాతివ్యతిరేకులు అనుకోలేదని అన్నారు. ఈ వ్యాఖ్యలను ప్రతిపక్షం మంచి అవకాశంగా భావించింది. దాంతో.. మరింత నష్టం జరగకూడదనే అమిత్ షా వెళ్లినట్లు తెలుస్తోంది.