దేశ అత్యున్నత పీఠంపై తొలి ఆదివాసీ మహిళ ఆశీనులయ్యారు. నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం సోమవారం అట్టహాసంగా జరిగింది. పార్లమెంట్ సెంట్రల్ హాలు నందు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ .. ద్రౌపది ముర్ముతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, దౌత్య కార్యాలయ అధిపతులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తొలుత ముర్ము రాష్ట్రపతి భవన్ కు వెళ్లగా ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు ఆమెకు పుష్పగుచ్చం అందించి సాదరంగా స్వాగతం పలికారు. తదుపరి రాష్ట్రపతి అంగరక్షక దళం ఆమెకు గౌరవవందనం సమర్పించారు. అక్కడి నుండి సంప్రదాయబద్దంగా నిర్వహించే ఊరేగింపు తో ముర్ము పార్లమెంట్ సెంట్రల్ హాలుకు చేరుకున్నారు. ఆమె వెంట రామ్ నాథ్ కోవింద్ పాల్గొన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాలు కు చేరుకున్న ద్రౌపది ముర్ముకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్వాగతం పలికారు.
ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధిగా పోటీ చేసిన ద్రౌపది ముర్ము భారీ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాపై ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. తొలి సారిగా ఆదివాసీ మహిళకు రాష్ట్రపతి అయ్యే అవకాశం దక్కడంతో ప్రతిపక్షాలకు చెెందిన వంద మందికిపైగా ప్రజా ప్రతినిధులు వారి వారి పార్టీ స్టాండ్ కు భిన్నంగా ద్రౌపది ముర్ముకు క్రాస్ ఓటింగ్ చేశారు.