శ్రీకాకుళం జిల్లా వైసీపీలో కీలక నాయకులుగా ఒక పక్క స్పీకర్ తమ్మినేని సీతారామ్, మరో పక్క ధర్మాన సోదరులు ఉన్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వైసీపీలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా..? అంటే ఉంటాయి అనే మాట వినబడుతోంది. తమ్మినేని సీతారామ్ కు 35 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం స్పీకర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో పక్క ధర్మాన సోదరులకు మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. 1989 నుండి ధర్మాన ప్రసాదరావు రాజకీయాల్లో ఉన్నారు. 2004 నుండి కృష్ణదాసు రాజకీయాల్లో ఉన్నారు. శ్రీకాకుళం వైసీపీకి ఈ నాయకులే బ్యాక్ బోన్ గా చెప్పుకోవచ్చు. అయితే వచ్చే ఎన్నికల్లో వీళ్లు పోటీ చేస్తారా..? లేదా..వీళ్ల నియోజకవర్గాలు ఏమైనా మారుతాయా..? వీళ్లలో పార్లమెంట్ కు వెళ్లే అవకాశం ఉందా..? ఎందుకంటే శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ బలంగా ఉంది. టీడీపీకి రామ్మోహననాయుడు రూపంలో సరైన అభ్యర్ధి ఉన్నారు.
Srikakulam YSRCP
శ్రీకాకుళంలో అభ్యర్ధి మార్పు ఖాయం
వచ్చే ఎన్నికల్లో వైసీపీలో అభ్యర్ధి మార్పు ఉంటుంది అనేది సమాచారం. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ కు టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జి ఇచ్చారు. శ్రీకాకుళం పార్లమెంట్ సీటు కిళ్లి కృపారాణికి ఇస్తారా..? అంటే గతంలో పోటీ చేసి ఓడిపోయారు. మరి కొన్ని వ్యవహారాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో తమ్మినేని సీతారామ్ ను పార్లమెంట్ కు పంపే ఆలోచన పార్టీ చేస్తున్నది అని అంటున్నారు. ఆయనకు సామాజిక బలం ఉంది. అంగ బలం, అర్ధబలం ఉన్నాయి. అనుభవం ఉంది. అన్నీ తెలుసు కాబట్టి పార్లమెంట్ కు పంపే ఆలోచన చేస్తొందని సమాచారం. ఆయన కాని పక్షంలో ధర్మాన సోదరుల్లో ఒకరిని ఎంపిగా పంపించి, వాళ్ల వారసులను అసెంబ్లీలో పోటీకి నిలపాలనే ఆలోచన చేస్తున్నారుట. అయితే వాళ్ల వారసులకు సీటు ఇవ్వడానికి సీఎం జగన్ అంతగా సుముఖత చూపడం లేదు. ఈ అంశాలపై ఇలా జిల్లాలో పుకార్లు షికారు చేస్తున్నాయి.
అముదాలవలస నుండి గాంధీ ..?
ధర్మాన ప్రసాదరావుకు శ్రీకాకుళం లో అంత ఈజీగా అయితే ఏమీ లేదు. 2019 ఎన్నికల్లో ఆయనకు భారీ మెజార్టీ ఏమీ రాలేదు. తక్కువ మెజార్టీతోనే విజయం సాధించారు. తమ్మినేని సీతారామ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలసలో కూడా వైసీపీలో వర్గాల కారణంగా అంత ఈజీగా లేదు. తమ్మినేని సీతారామ్ గ్రామాల్లో పర్యటిస్తుంటే కొన్ని చూట్ల ప్రజలు నిలదీస్తున్నారు. ప్రజల నుండి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి సువ్వారి గాంధీ రెడీ అవుతున్నారు. ఆయనకు పోటీ చేయాలని ఉందో లేదో తెలియదు కానీ ఆయన అనుచరులు మాత్రం ఒత్తిడి చేస్తున్నారు. గాంధీ సొంత గ్రామం ఆముదాలవలస పక్కన ఉన్న పొందురు. ఈ మండలం చాలా పెద్దది. 90వేలకు పైగా ఓటింగ్ ఉంది. ఈ మండలానికి చెందిన గాంధీ 2019లోనే వైసీపీ నుండి టికెట్ ఆశించారు. అప్పట్లోనే జగన్మోహనరెడ్డి ఆయన పేరును పరిశీలించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే సీనియారిటీని పరిగణలోకి తీసుకుని తమ్మినేని సీతారామ్ కు జగన్ టికెట్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం సువ్వారి గాంధీ పోటీ లో ఉంటారు అని ఆయన అనుచరులు బలంగా చెబుతున్నారు. తమ్మినేని సీతారామ్ పార్లమెంట్ కు వెళతారు అని ఆ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.
నాలుగు నియోజకవర్గాల్లో గ్రూపులు
మరో పక్క తమ్మినేని సీతారామ్ పోటీ చేయకపోతే ఆయన కుమారుడే రంగంలో ఉంటారని తమ్మినేని వర్గీయులు చెబుతున్నారు. ఇక నర్సన్నపేట విషయానికి వస్తే ఇక్కడ వైసీపీకి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. పాతపట్నం నియోజకవర్గంలో వైసీపీకి అంత ఈజీగా లేదు. ఇచ్చాపురం, పలాస, టెక్కలిలోనూ అంతగా పరిస్థితులు బాగోలేవు. ఆముదాలవలస, శ్రీకాకుళం, నర్సన్నపేటల మీద వైసీపీ హోప్స్ పెట్టుకుంది. పార్లమెంట్ కు అభ్యర్ధి ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో వ్యతిరేక గ్రూపులు తయారు అవుతున్నాయి. పాతపట్నంలో మామిడి శ్రీకాంత్ రెడీ అవుతున్నారు. తనదే టికెట్ అని చెప్పుకుంటున్నారు. అక్కడ రెడ్డి శాంతి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తనకే టికెట్ వస్తుందని శ్రీకాంత్ ప్రజల్లో తిరుగుతున్నారు. టెక్కలి వైసీపీలో మూడు గ్రూపులు ఉన్నాయి. నియోజకవర్గాల్లో గ్రూపులు బయటపడుతున్న నేపథ్యంలో పార్టీలో ఎటువంటి మార్పులు జరుగుతాయేది వేచి చూడాలి.