మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఒక పర్యాయం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారణ చేసిన సీబీఐ అధికారులు .. మరో సారి నోటీసులు జారీ చేశారు. గత నెల 28న తొలిసారిగా అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హజరు కాగా అధికారులు ఆరు గంటల పాటు విచారించారు. ఆనాడు వివేకా కాల్ డేటా ఆధారంగా సుదీర్ఘ విచారణ జరిపిన సీబీఐ అధికారులు.. ఆ తర్వాత తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో పని చేసే నవీన్, అదే విధంగా సీఎం ఒఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి లను కడపకు పిలిపించి సుదీర్ఘంగా విచారించారు. అయితే ఇప్పుడు మరో మారు ప్రశ్నించేందుకు అవినాష్ రెడ్డికి సీబీఐ నుండి పిలుపు వచ్చింది.
ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు సీబీఐ అధికారులు. తాజాగా అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డికి కూడా సీబీఐ నోటీసులు జారీ చేసింది. అవినాష్ రెడ్డిని 24వ తేదీన హైదరాబాద్ కు విచారణకు రావాలని పేర్కొన్న సీబీఐ అధికారులు.. ఒక రోజు ముందు ఈ నెల 23వ తేదీన ఆయన తండ్రి భాస్కరరెడ్డిని విచారించనున్నారు. భాస్కరరెడ్డికి పంపిన నోటీసుల్లో కడప లేదా హైదరాబాద్ ఎక్కడికి వస్తారో చెప్పాలని సీబీఐ కోరింది.
గత విచారణ ముగిసిన తర్వాత సీబీఐ కార్యాలయం నుండి బయటకు వచ్చిన అవినాష్ రెడ్డి తనను మరో సారి పిలిచే అవకాశం ఉందని వెల్లడించారు. మొదటి విచారణ సమయంలో కడప ఎంపీ కాల్ డేటా ఆధారంగా సుదీర్ఘంగా విచారణ జరిపిన సీబీఐ అధికారులు.. ఇప్పుడు రెండో సారి మరిన్ని విషయాలపై విచారించే అవకాశం ఉంది.