అమరావతి: ఎన్నికల సంఘం అనుమతి ఇస్తే క్యాబినెట్ సమావేశం నిర్వహించవచ్చని ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఈ నెల పదవ తేదీన క్యాబినెట్ సమావేశానికి ఏర్పాట్లు చేయాలని ఎల్వి సుబ్రమణ్యంకు ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ) ప్రిన్సిపల్ సెక్రటరీ లేఖ పంపిన నేపథ్యంలో ఆయన స్పందన ఎలా ఉంటుందన్న విషయంలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ సిఎస్ బంతిని మళ్లీ ముఖ్యమంతిరి కోర్టుకే పంపారు.
క్యాబినెట్ భేటీలో ఫోని తుఫాను ప్రభావం, నష్టపరిహారం, ఖరీఫ్ యాక్షన్ ప్లాన్, వేసవిలో మంచినీటి సమస్య తదితర విషయాలపై జరిగే అవకాశం ఉందని భావిస్తున్నా బిజినెస్ రూల్స్పైనా చర్చిస్తారేమో అన్న అనుమానాలు అధికార వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.
క్యాబినెట్ సమావేశానికి సంబంధించి ఎన్నికల నియమావళికి అనుగుణంగా అధికారులు నడుచుకోవాలని నిన్న ఎన్నికల ప్రధాన అధికారి (సిఇఒ) గోపాలకృష్ణ ద్వివేది సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిఎంఒ కార్యాలయం నుండి వచ్చిన నోట్ను వివిధ శాఖ కార్యదర్శులకు పంపిన సిఎస్ సుబ్రమణ్యం దీనిపై చర్చించేందుకు మంగళవారం సిఇఒ గోపాలకృష్ణ ద్వివేదితో భేటీ అయ్యారు.
అనంతరం ప్రధాన కార్యదర్శి ఎజెండా అెంశాలేమిటో తనకు పంపాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కోరారు. ఎజెండా అంశాలను కేంద్ర ఎన్నికలసంఘానిక పంపుతాననీ, అక్కడ నుంచి అనుమతి వస్తే మంత్రివర్గ సమావేశం నిర్వహించవచ్చనీ ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వి సుబ్రమణ్యంను నియమించినప్పటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు, సిఎస్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఎన్నికల సంఘం సిఎస్గా సుబ్రమణ్యంను నియమించడాన్ని సిఎం చంద్రబాబు తప్పుబట్టడమే కాకుండా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్కు సంబంధించిన ఒక కేసులో ఎల్వి సుబ్రమణ్యం సహ నిందితుడనీ, ఆయన్ను ఎలా నియమించారు అంటూ కూడా ప్రశ్నించారు. హైకోర్టులో ఆయన (సిఎస్)పై చార్జి షీటు తొలగించినా సిబిఐ సుప్రీం కోర్టులో అప్పీల్ చేసిందని కూడా చంద్రబాబు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో గుర్రుగా ఉన్న సిఎస్ సుబ్రమణ్యం బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆర్థిక శాఖ వ్యవహారలపై సమీక్ష జరపడంతో పాటు ఆపధర్మ ముఖ్యమంత్రికి ఎటువంటి అధికారాలు లేవన్నట్లు ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం పెద్ద దుమారాన్నే లేపింది. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు, సిఎస్ సుబ్రమణ్యంలు ఎదురు పడిన సందర్భాలు లేవు.