చాలా కాలంగా మునిసిపాలిటీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అమెరికాలోని వర్జీనియా బీచ్ నగరంలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో అతడు కూడా మరణించినట్లు పోలీసు అధికారులు మీడియాకు తెలిపారు. గాయపడినవారిలో ఒక పోలీసు అధికారి కూడా ఉన్నారని, అయితే ఆయన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం వల్ల ప్రాణాలతో బయటపడినట్లు పోలీసు చీఫ్ జేమ్స్ సెర్వెరా తెలిపారు. భవనంలోని పలు అంతస్తులలో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని ఆయన చెప్పారు.
అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వశాఖలున్న భవన సముదాయంలోకి ప్రవేశించిన దుండగుడు ఎడాపెడా కాల్పులు జరిపాడు. ఇది వర్జీనియా బీచ్ చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజని మేయర్ బాబీ డయ్యర్ అన్నారు. ఇంకా పలువురు నాయకులు, అధికారులు కూడా కాల్పుల ఘటన పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తాను భవనంలోని రెండో అంతస్తులో ఉన్నానని, తన సూపర్ వైజరుకు గట్టిగా శబ్దం వినిపించడంతో ఉద్యోగులంతా లోపలకు వెళ్లిపోవాలని చెప్పారని మెగన్ బాంటన్ అనే మహిళ తెలిపారు. దాదాపు 20 మందిమి అలా నేలకు అతుక్కుపోయామని, చాలాసేపు తుపాకి మోతలు వినిపిస్తూనే ఉన్నాయని అన్నారు. ఆ సమయంలో కొందరు ఉద్యోగులు భయంతో కేకలు పెట్టగా, మరికొందరు పూర్తి నిశ్శబ్దంగా ఉన్నారని చెప్పారు.
ఘటనా స్థలానికి ఎఫ్బీఐ అధికారులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతం సముద్ర ప్రాంతానికి కొన్ని మైళ్ల దూరంలో ఉంది. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సమాచారం ఇచ్చినట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. క్షతగాత్రుల పరిస్థితి ఏంటన్న విషయం పూర్తిగా తెలియలేదు. గాయపడ్డ వారిలో ఐదుగురిని సెంటారా వర్జీనియా బీచ్ జనరల్ ఆసుపత్రికి తరలించగా, మరొకిరిని సెంటారా ప్రిన్సెస్ అన్నె ఆసుపత్రికి తీసుకెళ్లారు.
పోలీసులు దుండగుడిని కాల్చిచంపిన వెంటనే భవనంలో ఉన్నవారికి ఆ విషయం చెప్పారు. దాంతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారని అదే భవనంలోని కోర్టులో పనిచేసే షీలా కుక్ చెప్పారు. అప్పుడు తాము బయటికొచ్చి దేవుడున్నాడని నమ్మామన్నారు.