షేక్స్పియర్ రాసిన “కింగ్ లియర్” నాటకం ఆధారంగా తెలుగులో ఓ సినిమా వచ్చింది. దాని పేరు “గుణసుందరి కథ.” అందులో కామిక్ విలన్లు ఓ పాట పాడతారు- “ఏం చేస్తే అదే ఘనకార్యం- మనమేం చేస్తే అదే ఘనకార్యం….” అంటూ. మన రాజకీయ వాదుల్లో ఎక్కువమందికి ఇదే జాతీయగీతం!
తాము చేసేదంతా ఘనకార్యమని అనడం-అనుకోడంతో అయిపోలేదు- ఎదుటివాళ్ళు చేసేదంతా ఘోరమనీ నేరమని వేనోళ్లతో విరుచుకుపడడం కూడా ఈ రాజకీయులకు నిత్య(అ)కృత్యం! మన రాజకీయాల్లో -ముఖ్యంగా పార్లమెంటరీ రాజకీయాల్లో- ప్రతి ఒక్కడిదీ ఒకే రూలు! అదేమిటంటే, “నేను చేసేదంతా రైటు- నువ్వు చేసేదంతా తప్పు” అనే ఏకైక నియమం!
ఉదాహరణకి, నువ్వు దొంగతనం చేస్తే నువ్వు దొంగవి
అదే నేను చేస్తే దొరని!
నువ్వు గూండాయిజం చేస్తే నువ్వు రౌడీవి-
అదే నేను చేస్తే ప్రజా పోరాట యోధుణ్ణి!
నువ్వు తప్పుడు పని చేస్తే అది అక్రమసంబంధం-
అదే నేనూ చేస్తే అది ప్రజాస్వామ్య పరిరక్షణ చర్య!
నువ్వు బాంకులకు పంగనామం పెడితే అది అవినీతి-
అదే నేనుచేస్తే వాణిజ్య నీతి!
నేను 23 మంది ఎమ్మెల్యేల్ని గంపగుత్తగా కొనేస్తే, అది ప్రజాస్వామ్యం!
నువ్వు నలుగురు ఎంపీల్ని కొంటే మాత్రం అది ధనస్వామ్యం.
ఒక్క ముక్కలో చెప్తే, రాజకీయాల్లో నువ్వేం చేసినా తప్పు- ప్రజాస్వామ్య పరిరక్షణార్థం నేను ఏంచేసినా అది రైటే!
రాజకీయ క్రీడా నిబంధనల్ని ఇంత సులువుగా మార్చేసినందుకు మనం అందరం, ఈ తరం రాజకీయుల్ని ముక్తకంఠంతో పొగిడి తీరవలసిందే! దాని సంగతి మరో సారి చూద్దాం- ఏ అనివార్య పరిస్థితుల్లో పాపం మన రాజకీయులు ఈ తరహా నియమ నిబంధనల్ని రూపొందించ వలసి వచ్చిందో ఆ విషయం ఒక్కసారి పరామర్శించుకుందాం.
ఎన్నికల ద్యూత క్రీడలో ఎప్పుడూ ఒక్క పార్టీకే గెలుపు దక్కదు. ఒక్కోసారి ఎంతగొప్ప చక్రధారి అయినా ఘోరంగా ఓడిపోవలసి వస్తూవుంటుంది. తెలుగు సినిమా పరిభాషలో చెప్పుకుంటే “ఓడలు ఒక్కోసారి బళ్ళు అవుతూ ఉంటాయి! పువ్వులమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి వస్తుంది!” మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి, విలవిలలాడుతున్న చంద్రబాబు ప్రస్తుతం బండిగా మారిన ఓడలో పడుతూ లేస్తూ పయనిస్తున్నారు. చెంపదెబ్బకు తోడు గోడదెబ్బ కూడా కలిసివచ్చింది ఆయనకు. “బయ్ వన్ గెట్ వన్ ఫ్రీ” తరహా పురస్కారం ఇది! ఇప్పుడు, పుండుమీద పడ్డ కారం తుడుచుకోలేక నానా అవస్థలు పడుతున్నారు ఒకప్పటి చక్రధారి చంద్రబాబు. దాదాపు నాలుగేళ్ల పాటు మిత్రపక్షంగా ఆయన చంకనేసుకుని తిరిగిన బీజేపీ, నిన్నగాకమొన్న ఆయన పార్టీకి చెందిన నలుగురు ఎంపీల్ని కొనేసింది మరి! అదికూడా ఆషామాషీగా జరగలేదు.
“అమిత” మేధావి ఒకరు వేసిన పన్నాగం మేరకు ఈ ఫిరాయింపు ప్రక్రియ జరిగింది. వీళ్ళు నలుగురూ వృత్తి రాజకీయవేత్తలు కారు. వ్యాపారాల మీద వేల కోట్ల రూపాయలు నొల్లేసుకున్న ప్రజాసేవకులు వీళ్ళు! కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ -ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతను మెప్పించి- మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు ఈ పెద్దమనుషులు! ఇలాంటివాళ్లను చూసే హెన్రిక్ ఇబ్సెన్ “పిల్లర్స్ ఆఫ్ ది సొసైటీ” నాటకం రాసాడు- అది చూసి మన వాహినీ పెద్దలు “పెద్దమనుషులు” సినిమా తీశారు. ఇలాంటివాళ్ల పుణ్యచరితం చెప్పుకుంటే తరించిపోతాం- అంచేత ఆ పనేదో చేద్దాం రండి!
భూమి గుండ్రంగా ఉందని మరోసారి రుజువు చేసిన మహానుభావుడూ, రాయలసీమ ప్రాంతమంతటిలోకీ ఎక్కువ ధనికుడూ, ఏయే రచయితలూ అధికారులూ దేశద్రోహులో గుర్తించి ఎవరెవర్ని ఉరితియ్యాలో, ఎవర్ని షూట్ చేసి పారేయాలో ఎప్పటికప్పుడు చెప్పే రక్షక భటుడూ అనిపించుకున్న టీజీ వెంకటేష్ విషయం తీసుకోండి. టీడీపీ కాంగ్రెస్ పార్టీలమధ్య ఉయ్యాలా జంపాలా ఆడి విసుగొచ్చిందో ఏమో వెంకటేష్ మొన్ననే బీజేపీలో చేరిపోయారు. దాంతో రాజకీయ భూగోళం మాత్రం కచ్చితంగా గుండ్రంగానే ఉందని వెంకటేష్ రుజువు చేశారు. కంచ ఐలయ్యనూ, ఐఏఎస్ అధికారుల్లో అసమర్థులనూ ఉరితీయడమో, కాల్చిపారేయడమో ఎంచుకునే అవకాశం ప్రభుత్వానికే ఇచ్చిన ఉదారుడు వెంకటేష్. ఆయన్ని ఎక్కడ నొక్కితే నోరు తెరిచి (లేదా మూసి) తమకు నచ్చినట్లు ప్రవర్తిస్తాడో “అమిత” మేధావులైన బీజేపీ వాళ్లకి మనం చెప్పాలా? అక్షరాలా అదే చేసి ఆయన్ని ఫ్రీగా కొట్టేశారు ప్రభువులు!
ఇక, యలమంచిలి సత్యనారాయణ చౌదరి అనే “సుజనా” చౌదరి కథే తీసుకోండి. ఎండ ఎంత మండిపోతున్నా ముతక జాకెట్ తొడుక్కుని తిరిగే ఈ పెద్దమనిషి బీజేపీ-టీడీపీ విడాకులు తీసుకునేంతవరకూ, కేంద్ర మంత్రిగా పనిచేశారు. కేవలం పదవుల కోసమే పార్లమెంటరీ రాజకీయాల్లోకి దిగిన ఈ పెద్దమనిషి అధికారకాంత విరహాన్ని భరించలేక ఇటీవలే బీజేపీలో చేరిపోయారు. ఓ వెబ్సైటు ఆయన బీజేపీలో చేరిన వార్తను ప్రచురిస్తూ “ఏస్ బ్యాంకు డిఫాల్టర్ వై.ఎస్. చౌదరి జాయిన్స్ బీజేపీ ” అనే హెడ్డింగ్ ఇవ్వడం గమనార్హం. అదీ మన చౌదరి గారి ఖ్యాతి! 2018 నవంబరు నెలాఖరున “సుజనా” చౌదరి పై ఎం.పి.ఎల్.ఏ కేసు విచారణలో భాగంగా దాడులు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే! 120 షెల్ కంపెనీలు పెట్టి ఆర్ధిక అక్రమాలకు పాల్పడ్డారన్నది “సుజనా” చౌదరిపై ఆరోపణ. అలా దాడులు నిర్వహిస్తే పరువైన పెద్దమనిషి ఏం చేయగలడో అదే “సుజనా” చౌదరి కూడా చేశారు- సింపులుగా అధికార పార్టీలోకి ఫిరాయించేశారు.
వేల కోట్ల రూపాయలు సంపాదించిన చింతకుంట మునుస్వామి (సి.ఎం.) రమేష్ తెలుగు రాష్ట్ర విభజన సందర్భంగా పోషించిన పాత్ర అసమానం, అనుపమానం! ముఖ్యంగా, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం చేసిన నిరశన దీక్ష ఘట్టంలో రమేష్, చంద్రబాబును మించిన పాత్రపోషణ చేశారు. ఆయనకు ఆస్కార్ వస్తుందని ఎందరో అభిమానులు ఎదురుచూసి భంగపడ్డ సంగతి తెలిసిందే!
ఇక, గరికపాటి మోహన్ రావు కథ కూడా ఇదే తరహా మలుపులతో సాగి, ఇలాగే ముగిసింది.
దాంతో, తెలుగు బాకాభజంత్రీలకు వొళ్ళు వశం తప్పింది! అక్షరాలా పూనకమే వచ్చింది.
చరిత్రలో మొట్టమొదటి సారి, నట్టనడిరోడ్డు మీద, ప్రజాస్వామ్యం హత్యకావించ బడిందని ఈ తెలుగు బాకాభజంత్రీలు గొంతు చించుకోవడం మొదలైంది. ఈ “బాకాభజంత్రీలు” గజనీకి అన్నదమ్ములు! పాపం వాటి జ్ఞాపకశక్తి బహుపరిమితం. కిందటి అసెంబ్లీ హయాములో, జగన్మోహన్ రెడ్డి పార్టీ వైస్సార్సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేల్ని గంపగుత్తగా టీడీపీలోకి “చేర్చుకున్న” (అనగా “కొనుక్కున్న” అని అర్థం!) విషయం ఈ “బాకాభజంత్రీలు” మర్చిపోయినట్లు కనిపిస్తోంది. అలా పార్టీ ఫిరాయించడానికి అంగీకరించని పాపానికి ఆర్కే రోజా విషయంలో టీడీపీ అధినేతలు అసెంబ్లీలో ప్రవర్తించిన తీరుతెన్నుల్నిఈ “బాకాభజంత్రీలు” మర్చిపోయారనిపిస్తుంది! టీడీపీ మూడు పూట్లా కూడు కుడిచే ఈ గొంగట్లో వెతుక్కుంటూ పొతే ఇలాంటివి చాలానే దొరుకుతాయి! వాటినలా వదిలెయ్యండి!
అయితే, షష్టి గడియలూ దేవుని దయ గురించి మాట్లాడేవాళ్ళయినా పాపఫలాల గురించి “పవిత్రగ్రంథం” ఏం చెప్పిందో ఒక్కసారి తల్చుకోవడం మాత్రం అత్యవసరం! పాపానికి ఏడు -చేదు- ఫలాలు ఉంటాయంటోంది “పవిత్రగ్రంథం”. పాపఫలాల్లో మొదటిది మోసం. రెండోది నాశనం. మూడోది సత్యప్రేమకు దూరంకావడం. నాలుగోది దుర్మార్గంలో ఆనందం పొందడం. అయిదోది ప్రబలమైన భ్రమలో చిక్కుకుపోవడం. ఆరోది అసత్యాన్ని నమ్మడం. ఏడోది కఠిన శిక్షకు పాత్రం కావడం!
పాపం ఎవరు చేసినా -వాళ్ళు మన మిత్రులైనా, శత్రువులైనా- ఈ చేదు ఫలాలను మింగక తప్పదంటోంది “పవిత్రగ్రంథం”. మనమేం చేస్తే అదే ఘనకార్యం, అదే పుణ్యకార్యం అనుకునే వాళ్లకి ఇలాంటి భయాలు ఉండవు. మరి పాపభీతి ఉన్నవాళ్ళకైనా ఉండాలి కదా
మందలపర్తి కిషోర్
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ