అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయిన పల్నాడు ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అజ్ఞాతం వీడి నేడు మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు.
గురజాల నియోజకవర్గం నుండి ఆరు సార్లు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన యరపతినేని మూడు సార్లు విజయం సాధించారు. ఇటీవల జరిగిన జరిగిన ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఈ నేపథ్యంలో ఆయన టిడిపిని వీడుతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని నిన్నటి వరకూ ఎవరూ ఖండించలేదు. కాగా ఆదివారం అనూహ్యంగా ఆయన అజ్ఞాతం వీడి మీడియా ముందుకు వచ్చారు.
ప్రాణం ఉన్నంత వరకూ తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని యరపతినేని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు మనోధైర్యాన్ని కోల్పోకుండా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని యరపతినేని పిలుపు నిచ్చారు. అభివృద్ధిలో పోటీపడాలి కానీ అరాచకంలో కాదని యరపతినేని అన్నారు. పల్నాడులో ఫ్యాక్షనిజం నిర్మూలనకు వైసిపి కలిసి రావాలని యరపతినేని కోరారు.
టిడిపి అధికారంలో ఉన్నప్పుడు పల్నాడు ప్రశాంతంగా ఉందనీ, వైసిపీ అధికారంలోకి రాగానే గ్రామాల్లో టిడిపి కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. దీంతో టిడిపి కార్యకర్తలు గ్రామాలు వదిలి వెళ్లారని యరపతినేని అన్నారు. ఏ గ్రామంలో వైసిపి దాడులకు దిగినా నియోజకవర్గంలోని టిడిపి కార్యకర్తలు అందరూ ఆ గ్రామానికి అండగా ఉండాలని యరపతినేని అన్నారు.