అమరావతి: వరదను అడ్డం పెట్టుకొని టిడిపి నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్లలో ఇంత భారీ స్థాయిలో ఎప్పుడూ వరదలు రాలేదని అనిల్ కుమార్ అన్నారు. గరిష్టంగా 8.05లక్షల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజి నుండి వదిలినట్లు ఆయన చెప్పారు. ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుంటూ సరైన సమయంలోనే వరద నీటిని దిగువకు వదిలామని అనిల్ కుమార్ పేర్కొన్నారు.
టిడిపి అధినేత చంద్రబాబు నివాసం ముంచాలన్న ఆలోచన తమకు లేదని అనిల్ కుమార్ అన్నారు. భారీగా వరద నీరు వచ్చినప్పుడు కొన్ని ఇళ్లు, పొలాలు ముంపుకు గురి అవ్వడం సహజమని అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. సరైన సమయంలోనే వరద నీటిని దిగువకు విడుదల చేశామనీ, ప్రాక్టుల నుంచి నీటిని వదిలినప్పుడు అధికారులకు కొన్ని లెక్కలు అనుసరిస్తారని అనిల్ కుమార్ వివరించారు. టిడిపి నేతలు దిగజారుడుతనంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిపై సమీక్షిస్తున్నారని అనిల్ కుమార్ తెలిపారు.
వరద కారణంగా ఆరు వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయనీ, పూర్తి స్థాయి వరద నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని అనిల్ కుమార్ తెలిపారు. బాధితులను ఆదుకోవడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు బాగా పని చేశారని అనిల్ కుమార్ అన్నారు. అధికారులతో సమీక్షలు చేయడం ఒక్కటే తమ బాధ్యత కాదనీ, క్షేత్ర స్థాయిలో ప్రజల బాగోగులు పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంటుందని అనిల్ కుమార్ పేర్కొన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో అన్ని సహాయక చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు. రాయలసీమకు పూర్తి స్థాయిలో నీటిని వినియోగించేందుకు కృషి చేస్తున్నామని అనిల్ కుమార్ చెప్పారు.
ఆ పార్టీ అధినేత దృష్టిలో పడేందుకే టిడిపి నేత బుద్దా వెంకన్న ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించారనీ, ఆయన ఆత్మహత్య చేసుకునేది లేదు, మనం చూసేది లేదని మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు.