న్యూఢిల్లీ: వాట్సాప్ ద్వారా భారత్కు చెందిన కొందరి మొబైల్ ఫోన్లను హ్యాకింగ్ చేశారన్న వార్త రాజకీయ దుమారాన్ని రేపుతోంది. తాజాగా దీనిపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. భారత్కు చెందిన జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల వ్యక్తిగత సమాచారాన్ని ‘పెగాసస్’అనే స్పైవేర్ సాయంతో చోరీచేయడమంటే మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లేనని ఆమె అన్నారు. ఇలాంటి ఘటనతో దేశ భద్రతకు ఎంతో ముప్పు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందిచాలని ప్రియాంక ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు.
If the BJP or the government has engaged Israeli agencies to snoop into the phones of journalists, lawyers, activists and politicians, it is a gross violation of human rights and a scandal with grave ramifications on national security. Waiting for the government’s response.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 1, 2019
ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో అనే నిఘా సంస్థ భారతీయ జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలకు సంబంధించిన వాట్సాప్ అకౌంట్లను హ్యాక్ చేసినట్లు వాట్సాప్ ద్రువీకరించిన సంగతి తెలిసిందే. సంస్థ అభివృద్ధి చేసిన స్పైవేర్ ‘పెగాసస్’ వైరస్ తో ఈ నేరానికి పాల్పడ్డారు. 20 దేశాలకు చెందిన దాదాపు1400 మంది యూజర్ల ఫోన్లలోని వ్యక్తిగత సమాచారాన్నివాట్సాప్ ద్వారా హ్యాక్ చేశారు. అయితే కచ్చితంగా ఎంత మంది ఫోన్లు హ్యాక్ అయ్యాయన్న విషయాన్ని మాత్రం వాట్సాప్ స్పష్టం చేయలేకపోయింది.