విజయవాడ: తిరుమల ఆలయంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొడాలి నానిపై విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద సూర్య మంత్రిపై ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమల ఆలయంపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం జగన్ అన్ని మతాలను గౌరవించాలని, ఇతర మతాలను కించపరిచేలా ప్రోత్సహించటం సీఎంకు తగదని ఆనంద సూర్య తెలిపారు. మానవత్వం మరిచి మాట్లాడుతున్న మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొడాలి చేసిన వ్యాఖ్యలకు గాను తిరుమల శ్రీవారి పాదాలపై పడి యావత్ హిందూ జాతికి క్షమాపణ చెప్పాలన్నారు.
గతంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తిరుమలకు వెళ్లిన సమయంలో డిక్లరేషన్ ఇవ్వకపోవడంపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తిరుపతిలో బీజేపీ నేతలు కూడా ఇప్పటికే మంత్రి కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. వెంటనే కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వివాదంపై మంత్రి కొడాలి నాని ఇప్పటివరకు స్పందించలేదు.
https://www.facebook.com/echandhu.epril/videos/472568993465802/