(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అత్యాచారం చేసిన నిందితులపై దయ చూపాల్సిన అవసరం లేదని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. పలు అత్యాచార కేసుల్లో క్షమాభిక్ష కోసం పెట్టుకున్న పిటిషన్లపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారం..హత్య, హింసలు వంటి కేసుల్లో దోషులు క్షమాభిక్ష కోసం పిటీషన్లు పెట్టుకుంటున్నారనీ.. కానీ రేపిస్టులపై దయా చూపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. రాజస్థాన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మహిళల భద్రత ముఖ్యం. పోక్సో చట్టం కింద అత్యాచారం చేసిన దోషులకు దయ పిటిషన్ దాఖలు చేసే హక్కు ఉండకూడదు. ఈ పిటిషన్లపై పార్లమెంట్ సమీక్షించాలి’ అని పేర్కొన్నారు. దిశ హత్యాచారం కేసులో జరిగిన ఎన్కౌంటర్పై ఎవరి అభిప్రాయం వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైయ్యాయి.
లైంగిక నేరాలకు గురయ్యే బాలలను రక్షించడం కోసం ప్రత్యేకంగా పోక్సో చట్టం రూపొందించారు. 18 ఏళ్ల లోపు బాలలపై లైంగిక వేధింపులు జరిగితే వారిపై ఈ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. నేరం రుజువైతే సాధారణ శిక్ష నుంచి కఠిన కారాగార శిక్ష, జీవిత ఖైదు విధించవచ్చు.
ఇదిఇలా ఉంటే.. దేశంలో క్షమాభిక్ష పిటిషన్లపై తుది నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రపతికే ఉంది. ఇప్పటికే చాలా హత్య కేసులు, అత్యాచారం కేసుల్లో కోర్టులు ఉరిశిక్ష విధించాయి. అయితే, దోషులు… రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకుంటున్నారు. దీంతో ఆ శిక్ష అమలు కావడం లేదు.