అమరావతి: ఆడ పిల్లల వైపు వక్రబుద్దితో చూడాలంటేనే భయపడే విధంగా కఠినాతి కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
దిశ ఉదంతం మన ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని హెచ్చరిస్తోందన్నారు. ఆ కరాళరాత్రి వేళ నలుగురు ముష్కరులు మధ్య దిశ ఎంత నరకాన్ని చూసిందో తలుచుకుంటేనే ఆవేశం, ఆవేదనతో శరీరం ఉడికిపోతోందన్నారు. జాతి యావత్తు తక్షణ న్యాయం కోరుకోవడానికి కారణం ఈ ఆవేదననేనని పేర్కొన్నారు.
దిశ సంఘటన ముగిసిందని దీనిని మనం ఇంతటితో వదిలిపెట్టకూడదని అన్నారు. మరే ఆడబిడ్డకు ఇటువంటి పరిస్థితి రాకూడదన్నారు. నిర్భయ ఉదంతం తరువాత బలమైన చట్టాన్ని మన పార్లమెంట్ తీసుకువచ్చిందన్నారు. అయినా అత్యాచారాలు ఆగలేదంటే ఇంకా కఠినమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇతర దేశాలలో ఎటువంటి చట్టాలు ఉన్నాయో అధ్యయనం చేయాలనీ, మేధావులు ముందుకు కదలాలనీ, వారి ఆలోచన శక్తితో ఇటువంట నికృష్ట ఘాతకాలకు చరమాంకం పాడాలనీ ఆయన కోరారు. ఇలాంటి కేసులలో కోర్టుల పరంగా తక్షణ న్యాయం లభించాలని పవన్ ఆకాంక్షించారు. రెండు మూడు వారాల్లోనే శిక్షలు పడేలా నిబంధనలు రావాలన్నారు. ఆడపడుచుల శ్రేయస్సు దృష్ట్యా శిక్షలు బహిరంగంగా అమలు చేయడానికి యోచన జరపాలనీ, నేర స్థాయిని బట్టి అది మరణ శిక్ష అయినా, మరే ఇతర శిక్ష అయినా బహిరంగంగా అమలు జరపాలని పవన్ పేర్కొన్నారు.
ప్రజలు కోరుకున్న విధంగా దిశ ఉదంతంలో సత్వర న్యాయం లభించిందని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా దిశ ఆత్మకు శాంతి కలగాలనీ ఈ విషాదం నుండి ఆమె తల్లిదండ్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.