అమరావతి: ఏపి సిఎం జగన్ పతిపక్ష నేతగా ఉన్న సమయంలో మూడు రాజధానుల ఫార్ములా ఎందుకు చెప్పలేదని బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. ఏపి రాజధానిని అమరావతి నుండి తరలించవద్దని కోరుతున్న రాజధాని ప్రాంత రైతుల బృందం శనివారం పురందేశ్వరిని కలిశారు. తమ ఆవేదనను వివరించి రాజధాని మార్పును నిలిపివేసేలా కేంద్రం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్రాన్ని ఒప్పించాలని వారు అభ్యర్థించారు. ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ అమరావతిలో రాజధాని ఏర్పాటుకు నాడు జగన్ సమర్థించారని గుర్తు చేశారు.
అభివృద్ధి వికేంద్రీకరణను బిజెపి మొదటి నుండి సమర్థిస్తోందని అన్నారు. అమరావతి ప్రాంతంలో రైతాంగం భూములను ఏ ఒక్క రాజకీయ పార్టీకో ఇవ్వలేదనీ, ప్రభుత్వానికి భూములు ఇచ్చింది రైతులు కాబట్టి అధికారంలో ఎవరున్నా భూములు ఇచ్చిన రైతులకు సమాధానం చెప్పాలన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే చంద్రబాబు వాటితో గ్రాఫిక్స్ చేయించి చూపారని పురందేశ్వరి విమర్శించారు. చంద్రబాబు చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణానికి పని చేయలేదని ఆమె ఆరోపించారు.
జిఎన్ రావు కమిటీ నివేదకను ప్రభుత్వం ఇంకా బహిర్గతం చేయలేదనీ, దీనిపై జగన్ ప్రభుత్వం రాజధాని ప్రాంత రైతులకు ఏమి సమాధానం చెబుతారో చూసిన తరువాత బిజెపి స్పందిస్తుందని పురందేశ్వరి అన్నారు.