అనంతపురం: నేతన్నలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. శనివారం ధర్మవరంలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్ఆర్ నేతన్న నేస్తం తెచ్చామన్నారు. ఈ పథకం అమలు ద్వారా రాష్ట్రంలో దాదాపు 85 వేల మంది చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు అందిస్తామన్నారు. అకౌంట్లలో పడే డబ్బులను బకాయిలు కింద జమ చేసుకోకుండా.. బ్యాంకులకు ఆదేశాలిచ్చామని జగన్ తెలిపారు. ఐదేళ్లలో ఒక్కో చేనేత కుటుంబానికి రూ.1.20లక్షలు ఇస్తామన్నారు. తన పాదయాత్రలో చేనేత కార్మికుల కష్టాలను చూశానని జగన్ చెప్పారు. ధర్మవరం నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఆప్కో వ్యవస్థను స్కాం వ్యవస్థగా మార్చేశారని, త్వరలో ఆప్కోను ప్రక్షాళన చేస్తానని వెల్లడించారు. నేతన్నలకు మరింత మంచి చేసే దిశగా అడుగులు వేస్తామని సీఎం జగన్ తెలిపారు.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మంచి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. 25 లక్షల పేదలకు ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు అందజేస్తామని ప్రకటించారు. జనవరి 9న అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లను ఆదుకున్నామని, అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా కల్పించామని, మత్స్యకారులను ఆదుకున్నామని సీఎం జగన్ వివరించారు.