(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఎట్టిపరిస్థితుల్లోనూ రాజధాని అమరావతి నుండి విశాఖకు తరలించే హక్కు సిఎం జగన్కు లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గురువారం ఆయన సిపిఐ నేతల బృందంతో మందడం, పెనుమాక రైతుల నిరాహారదీక్ష శిబిరాన్ని సందర్శంచి సంఘీభావం తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్ నియంతృత్వ పోకడల వల్ల 29 గ్రామాల ప్రజలు కన్నీరు పెట్టకుంటున్నారని ఆయన అన్నారు. జగన్కు ధైర్యం ఉంటే అమరావతి అంశం పై రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.మూడు రాజధానులు అంటే అందరూ నవ్వుకుంటున్నారని అన్నారు.రాజధాని ప్రాంత రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, ఈ విషయాన్ని అవసరం అయితే కేంద్రం దృష్టికీ తీసుకువెళతామనీ హామీ ఇచ్చారు. జగన్ కేబినెట్లో మంత్రులు అందరూ పరమానందయ్య శిష్యులుగా వ్యవహరిస్తున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. బస్టాండ్, సినిహా హాళ్లలో గొడవలు పడుతూ తిరిగే వారంతా చట్ట సభలకు ఎన్నికై మంత్రులు అయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం తిరగబడిందని అన్నారు.
అధికార పార్టీ మినహా అన్ని రాజకీయ పక్షాలు అమరావతి రైతాంగానికి అండగా ఉన్నారని చెప్పారు. రైతాంగానికి అన్యాయం జరుగుతుంటే సిపిఐ చూస్తూ ఊరుకోదని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని నారాయణ పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వ చర్యలపై తీవ్ర స్థాయిలో విమర్శించారు.
సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాజధాని మార్పు గురించి ఎన్నికలకు ముందు జగన్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కమిటీలు చెప్పాయని రాజధాని మార్చడం ఏమిటని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఎటువంటి భద్రత లేకుండా రాష్ట్రం మొత్తం ప్రశాంతంగా తిరిగిన జగన్ నేడు తాడేపల్లి నుండి పోలీసు భద్రత లేకుండా నాలుగు అడుగులు వేయగలరా అని ప్రశ్నించారు. ఈ పరిస్థితి ఎందుుకు వచ్చిందో ఆర్థం చేసుకోవాలన్నారు. రాజధాని ప్రాంతం ఎడారి, శ్మశానం అంటూ వ్యాఖ్యలు చేస్తున్న వారు శ్మశానంలో ఎడారిలో వందలాది మంది పోలీసులను ఎందుకు దింపారని ప్రశ్నించారు.
ఒ కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చి కుక్క అనే ముద్ర వేస్తారనీ అదే మాదిరిగా రాజధాని అమరావతిని చంపేందుకు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ మంత్రులు మాట్లాడుతున్నారని అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటే అధికారంలోకి వచ్చి ఏడు మాసాలు అయ్యింది, ఇప్పటి వరకూ ఏమి చేశారంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఒక్కరి మీద అయినా కేసు నమోదు చేశారా, కోర్టుకు ఈడ్చారా, అరెస్టు చేశారా అని రామకృష్ణ ప్రశ్నించారు. అమరావతిపై పోరాటానికి 18న కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. 20వ తేదీ నుండి ప్రత్యేక సమావేశాల సందర్భంలో చలో అసెంబ్లీకి తమ పార్టీ పిలుపు ఇస్తోందని చెప్పారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామని రామకృష్ణ తెలిపారు.