హైదరాబాద్, జనవరి 16: తెలంగాణాలో అందరూ ఊహిస్తున్నట్లుగానే ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ బుధవారం బులిటెన్ను విడుదల చేశారు. టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచిన భూపతిరెడ్డి, రాములు నాయక్, యాదవ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారంటూ టిఆర్ఎస్ నేతల ఫిర్యాదు నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ ఈ చర్య తీసుకున్నారు.
అయితే టిఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన మరో నేత కొండా మురళి ఇటీవలే పదవికి రాజీనామా చేయడంతో మొత్తం నలుగురు ఎమ్మెల్సీలు పదవి కోల్పోయినట్లయింది. ఇక రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో పొందుపరచిన పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఈ ఎమ్మెల్సీలపై వేటు వేసినట్లు శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ చెబుతున్నారు. ఈ ఎమ్మెల్సీల ఫిరాయింపులపై టిఆర్ఎస్ నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగిందని, దీంతో వారినుండి వివరణ కోరడం జరిగిందని, అయితే వారి వివరణ సహేతుకంగా లేకపోవడంతో వేటు చర్య తీసుకున్నట్లు వివరించారు.
అయితే టిఆర్ఎస్ ఎమ్మెల్సీలపై వేటు విషయం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కారణం ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఫిరాయింపుకు పాల్పడిన నేతలు ఉండటమే. ఇక టిఆర్ఎస్ ఎమ్మెల్సీలపై వేటు విషయానికొస్తే మరి కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల విషయమేంటనే ప్రశ్నతలెత్తడం సర్వసహజం.
పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన చట్టసభల సభ్యులపై చర్యలు తీసుకోవచ్చంటూ ఫిరాయింపుల నిరోధక చట్టం చెబుతున్న విషయం నిజమే. ఒక పార్టీ గుర్తు మీద ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు తమ స్వప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయించడం అనైతికమైన విషయం.అయితే మరి అలాంటి నేతలను తమ పార్టీలో చేర్చుకోవడం ఏ విధంగా సమర్థనీయం అవుతుందో అర్థం కాని విషయం.
నైతికంగా ఆలోచిస్తే ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన ఏ ప్రజాప్రతినిథి అయినా తాను వేరే పార్టీలో చేరాలనుకుంటే తమ పదవికి రాజీనామా చేసే వేరే పార్టీలోకి వెళ్లాలి. లేదా వీరిని చేర్చుకునే పార్టీ అయినా వీరు ఆ పదవిని త్యజించిన తరువాత మాత్రమే తమ పార్టీలోకి తీసుకోవాలి. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.
అయితే టిఆర్ఎస్ పార్టీ మారిన తమ ఎమ్మెల్సీలపై వేటు పడేలా వ్యవహరిస్తూనే మరోవైపు ప్రతిపక్ష సభ్యులను తమ పార్టీలో చేర్చుకునే విధానానికి జోరుగా ప్రయత్నాలు సాగిస్తుండటం ఆ పార్టీ ద్వంద్వ నీతిని తేటతెల్లం చేస్తోంది. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ వైపు చేరిపోగా త్వరలోనే మరికొంతమంది కాంగ్రెస్ శాసనసభ్యులు ఆ పార్టీలో చేరనున్నట్లు టిఆర్ఎస్ నేతల వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి.
అయితే ఇవి పాతకాలంనాటి రోజులు కావని ప్రజలు ఈ పరిణామాలన్నీ గమనిస్తున్నారని రాజకీయ పార్టీలు ముఖ్యంగా అధికార పార్టీలు గుర్తెరగాలి. అవసరం లేకపోయినా ప్రత్యర్థి పార్టీల నుంచి నేతలను నయానో భయానో తమ పార్టీలోకి చేర్చుకోవడం వంటి విషయాలను ప్రజలు ఏవగించుకుంటున్నారు.
ఇటువంటి విషయాలను ప్రధాన మీడియా అధికార పక్షానికి అనుకూలంగా ఎంత మసిబూసి మారేడు కాయ చేస్తున్నా సోషల్ మీడియా విజృంభణతో లోగుట్టులన్నీ ప్రజల వద్దకు చేరుతూనే ఉన్నాయి. అందువల్ల ద్వంద్వ నీతి అవలంభిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడవకుండా టిఆర్ఎస్ సత్సాంప్రదాయాన్ని అవలంభించాలి. ఫెడరల్ ఫ్రంట్ తో జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని భావిస్తున్నకెసిఆర్ ఆ కోణంలో ప్రజాస్వామ్యానికి ఇప్పుడు తాను ఇచ్చే విలువ కూడా కౌంట్ అవుతుందనే విషయాన్ని గుర్తించాలి.