న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. పలు ప్రతిపక్షాలు నీతి ఆయోగ్ బేటీని బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రం సాధించిన ప్రగతి – అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై నివేదికను సమర్పించారు. అనంతరం సమావేశంలో ప్రసంగిస్తూ భారత్ లో లాజిస్టిక్స్ ఖర్చు చాలా ఎక్కువగా ఉందనీ, లాజిస్టిక్స్ కోసం పెడుతున్న ఖర్చు జీడీపీలో 14 శాతం గా ఉందన్నారు. భారతీయ ఉత్పత్తులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు ఇది ప్రతిబంధకంగా మారిందన్నారు. ఆమెరికాలో చూసుకుంటే లాజిస్టిక్స్ ఖర్చు కేవలం 7.5 శాతానికే పరిమితం అయ్యిందని చెప్పారు.
ప్రపంచ స్థాయిలో భారత ఉత్పత్తులు పోటీ పడాలంటే రవాణా వ్యయం గణనీయంగా తగ్గాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గడచిన తొమ్మిదేళ్లలో సరుకు రవాణా కారిడార్లు, జాతీయ రహదారులపై కేంద్ర ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తొందనీ, మనం ఆశించిన ఫలితాలను సాధించడానికి దీన్ని కొనసాగించడం చాలా అవసరమని అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం చేస్తున్న వ్యయం ప్రశంసనీయమన్నారు. ఏపి కూడా పోర్టు ఆధారిత అభివృద్ధిపై దృష్టి పెట్టిందనీ, ఇందులో భాగంగా కొత్త గా నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తొందని చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఎయిర్ పోర్టు అభవృద్ధి చేసినట్లు తెలిపారు. విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా పీపీపీ పద్ధతిలో నిర్మిస్తొందని వెల్లడించారు.
జీడీపీ పెరుగుదలలో సేవలు, తయారీ రంగాలే కీలకమని వ్యాఖ్యానించారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ద్వారా రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయనీ, తద్వారా 6 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రజారోగ్యం, పౌష్టికాహారం పై దృష్టి పెట్టామని చెప్పారు. వైద్యరంగంలో కీలకమన సంస్కరణలు తెచ్చామని సీఎం తెలిపారు. ఏపీలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకువచ్చామని వివరించారు. ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం చాలా అవసరమని చెప్పారు. తయారీ, సేవల రంగాల వాటా పెరుగుదలను సాధించడానికి పెట్టుబడులు చాలా అవసరమని అన్నారు. దీనికి అనుకూలమైన వ్యాపార వాతావరణం తప్పనిసరి అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపి గత మూడేళ్లుగా వరుసగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
సమ్మిళిత వృద్ధి సాధించడానికి మహిళా సాధికారత చాలా కీలకమనీ, మహిళలకు ఆర్ధిక వనరులు, అవకాశాలను పెంపొందిచడానికి ఏపి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రాలు కూడా ఒక జట్టుగా పని చేయాలని, ప్రతి రాష్ట్ర శ్రేయస్సు మొత్తం దేశంతో ముడిపడి ఉంటుందని జగన్ అన్నారు.
YS Viveka Case: తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట .. బుధవారం వరకూ ఆరెస్టు చేయవద్దు