AP Government: కరోనా నియంత్రణలో వైద్యులు, సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి విధులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్మోహనరెడ్డి సర్కార్ వైద్యులు, సిబ్బందికి భరోసానిచ్చేందుకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ బారిన పడి మరణించిన వైద్యులు, సిబ్బంది కుటుంబాలకు భారీ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు సోమవారం వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కోవిడ్ విధి నిర్వహణలో మృతి చెందిన వైద్యుని కుటుంబాలకు రూ.25లక్షలు, స్టాఫ్ నర్స్ లకు రూ.20లక్షలు, ఎఫ్ఎన్ఒ, ఎంఎన్ఒలకు రూ.15లక్షలు, ఇతర వైద్య సిబ్బంది మృతి చెందితే రూ.10లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం చెల్లించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ (పీఎంజికే) పథకానికి అదనంగా ఈ ఎక్స్ గ్రేషియా చెల్లించనున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. తక్షణమే ఎక్స్ గ్రేషియా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేసినట్లు ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కోవిడ్ నిర్వహణలో భాగంగా కోవిడ్ ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ లలో పని చేసే డాక్టర్లు, సిబ్బంది అలాగే కోవిడ్ పాజిటివ్ ఉన్న ఇళ్లను సందర్శించే సిబ్బంది మరణిస్తే వారివారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియాను పొందడానికి అర్హులుగా తెలిపారు. మరే ఇతర పథకాల ద్వారా గానీ, ఇన్సూరెన్స్ ద్వారా గానీ లబ్ది పొందే వారు కూడా ఈ ఎక్స్ గ్రేషియా పొందేందుకు అర్హులేనని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.
ప్రొహిబిషన్ డిక్లరేషన్ కోసం వేచి చూస్తున్న ఉద్యోగులు కూడా ఎక్స్ గ్రేషియా పొందేందుకు అర్హులుగా పేర్కొంది. కోవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్ తో పాటు కోవిడ్ తో మరణించినట్లు దృవీకరణ పత్రం సమర్పిస్తే సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించిన తరువాత ఎక్స్ గ్రేషియాను ఆయా జిల్లాల కలెక్టర్ లు మంజూరు చేస్తారని ఉత్తర్వులో పేర్కొంది.