AP Governor Delhi Tour: ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ కు కేంద్రం నుండి కబురు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా నేపథ్యంలో చాలా కాలం నుండి గవర్నర్ ఢిల్లీకి వెళ్లలేదు. ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయి వచ్చారు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన మూడు రోజుల వ్యవధిలోనే గవర్నర్ కు ఢిల్లీ నుండి కబురు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read More: Eatala Rajender: ఫైలెట్ అప్రమత్తతో ఈటల బృందానికి తప్పిన పెను ప్రమాదం..!!
సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి సంబంధించి పలు ముఖ్యమైన అంశాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించిన నేపథ్యంలో వాటిపై గవర్నర్ తో చర్చించేందుకు పిలుపు వచ్చి ఉండవచ్చని అంటున్నారు. కేంద్రం నుండి గవర్నర్ కు పిలుపు వచ్చిందని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఏపి రాజ్ భవన్ నుండి దీనికి సంబంధించి అధికారికంగా ఏటువంటి సమాచారం లేదు. అయితే గవర్నర్ ఢిల్లీ టూర్ పై అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రధానంగా ఏడాదిన్నరగా పెండింగ్ లో ఉన్న మూడు రాజధానుల సమస్యతో పాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుపై నమోదైన రాజద్రోహం కేసు, సీఐడీ కస్టడీలో చోటుచేసుకున్న పరిణామాలు తదితర అంశాలపైనా కేంద్ర పెద్దలు గవర్నర్ వివరణ తీసుకోవచ్చని తెలుస్తోంది. అదే విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం, ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం, ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలు న్యాయసమీక్షలో నిలదొక్కుకోలేకపోవడం తదితర విషయాలపైనా చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. గవర్నర్ ఢిల్లీ టూర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నూ కలిసే అవకాశం ఉంది.