Asha Workers: ఏపిలో ఆశ వర్కర్లు జగన్ సర్కార్ పై పోరుబాటకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ఆశవర్కర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఆశ వర్కర్ లకు పది వేల వేతనం ఇస్తున్న నెపంతో వారికి సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిలుపుదల చేసింది. అమ్మఒడి, ఫీజు రీయింబర్స్ మెంట్, ఇంటి స్థలం ఇలా ఏ ఒక్క సంక్షేమ పథకానికి అర్హులు కాకుండా అయిపోయారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో పది వేల వేతనంతో వీరు కుటుంబాలను నెట్టుకురావడం కష్టతరం అని అందరికీ తెలిసిందే. కానీ ప్రభుత్వం ఆర్థిక భారం తగ్గించుకునే క్రమంలో భాగంగా సంక్షేమ పథకాల లబ్దిదారుల సంఖ్యను కుదించేందుకు వీరికి ఆ ఫథకాలను దూరం చేశారు.
మరో విషయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం 1200 జనాభాకు ఒక ఆశ వర్కర్ పని చేయాల్సి ఉండగా పట్టణ ప్రాంతాల్లో 2500 నుండి 8వేల జనాభాకు ఒక్క ఆశవర్కరే పని చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో వీరికి పని భారం ఎక్కువ అవుతోంది. దీనికి తోడు ఇచ్చే పదివేల వేతనం కూడా ఒక్క సారే ఇవ్వడం లేదని కూడా చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6200లు ఒక సారి, రాష్ట్రం ఇచ్చే రూ.3,800లు మరో సారి జమ చేస్తున్నారు. 60 ఏళ్ల వరకూ పని చేసి రిటైర్ అయితే వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి బెన్ఫిట్స్ ఇవ్వకుండా ఒట్టిచేతులతోనే పంపుతున్నారు. దీంతో వీరు జీవితకాలం పని చేసిన ఆశవర్కర్లు చివరి దశలోనూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.
మరో పక్క గ్రామ సచివాలయంలో పని చేసే ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ గ్రామ సచివాలయకు అనుసంధానం చేస్తున్న ఆశ వర్కర్ లను మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేయడం లేదు. దీంతో వీరు ప్రభుత్వంపై ఆందోళనకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆశవర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముందుగా చలో కలెక్టరేట్ కార్యక్రమాలను చేపడుతున్నారు. సోమవారం (నేడు) కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నారు.
ప్రధానంగా వీరి డిమాండ్ లు ఏమిటంటే..ఆశవర్కర్లను పర్మినెంట్ చేయాలి. సచివాలయాలకు ఆశ వర్కర్ల బదలాయింపు ప్రక్రియను నిలుపుదల చేయాలి. అధికార రాజకీయ వేధింపులు అరికట్టాలి. రక్షణ పరికరాలైన శానిటైజర్, మాస్కులు, గ్లౌజులు అందించారు. సంక్షేమ పథకాలను అమలు చేయాలి, రిటైర్మెంట్ బెన్ఫిట్స్ కల్పించాలి, మూడు లక్షల ఎక్స్ గ్రేషియా, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. పని భారం తగ్గించాలి. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోనే ఆశవర్కర్ లను కొనసాగించాలి. పదివేల వేతనం ఒకే సారి ఇవ్వాలి తదితర డిమాండ్లతో వీరు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. వీరి డిమాండ్ల పై జగన్ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.