ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమైయ్యాయి. ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను తన ప్రసంగంలో వివరించారు గవర్నర్ అబ్దుల్ నజీర్. గవర్నర్ ప్రసంగం అనంతరం ఉభయ సభలు వాయిదా పడగా, అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ నెల 24వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. తొమ్మిది రోజుల పాటు ఎపీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 16వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయించారు.
సమావేశంలో సీఎం వైఎస్ జగన్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, జోగి రమేష్, చీఫ్ విప్ ప్రసాదరాజు, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం చీఫ్ విప్ ప్రసాదరాజు మీడియాతో మాట్లాడుతూ రేపు (బుధవారం) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందని తెలిపారు. బడ్జెట్ సెషన్ కావడంతో శని, ఆదివారాల్లోనూ (18,19) సమావేశాలు కొనసాగుతాయన్నారు. 21, 22 అసెంబ్లీ సమావేశాలకు సెలవు ప్రకటించామన్నారు. సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. ప్రతిపక్ష నేతను కూడా సభకు ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రతిపక్షం లేవనెత్తే అంశాలపై చర్చకు సిద్దమని ప్రసాదరాజు అన్నారు.
కాగా గవర్నర్ ప్రసంగంపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆక్షేపణ వ్యక్తం చేసారు. ప్రస్తుత గవర్నర్ స్థాయి తగ్గించారని విమర్శించారు. గవర్నర్ తో ముఖ్యమంత్రిని పొగిడించటమేంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి గవర్నర్ పెద్ద లేక ముఖ్యమంత్రా అని ప్రశ్నించారు. ప్రథమ పౌరుడితో సీఎంను పొగిడించి గవర్నర్ స్థాయి తగ్గించారన్నారు. ముఖ్యమంత్రి రాక కోసం గవర్నర్ ను కూడా స్వీకర్ కార్యాలయంలో వేచి ఉండేలా చేశారన్నుర. ఇది సభా నిబంధనలకు విరుద్దమన్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేసిన గవర్నర్ తోనూ ప్రభుత్వం అసత్యాలు చెప్పించిందని పయ్యావుల విమర్శించారు. సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న రాజధాని అంశంపై బహిరంగ ప్రసంగాలు చేసిన ప్రభుత్వం, గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం ఎందుకు పెట్టలేకపోయిందని ప్రశ్నించారు.
ఎంపీ అవినాష్ వినతిని తిరస్కరించిన సీబీఐ .. నాల్గవ సారి విచారణకు హజరైన అవినాష్ రెడ్డి