AP Govt: జగన్మోహనరెడ్డి సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. బహిరంగ మార్కెట్ నుండి రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్పు తెచ్చుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. మరో 10,500 కోట్ల రూపాయల రుణానికి కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకుకు (ఆర్బీఐ)కి వర్తమానం పంపింది. రుణ సేకరణకు ఇబ్బంది పడుతున్న ఏపి ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన ఈ వెసులుబాటుతో భారీ ఊరట లభించినట్లు అయ్యింది. కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలల కాలానికి అనుమతి ఇచ్చిన పరిమితి మేరకు ఇప్పటికే రుణ స్వీకరణ పూర్తయింది. అనుమతికి లోబడి చివరి విడత గా రూ.1000 కోట్లను గత మంగళవారం రుణంగా స్వీకరించింది. దీంతో కేంద్రం విధించిన పరిమితికి చేరుకోవడంతో మునుముందు రాష్ట్ర ఆర్థిక అవసరాలు ఎలా అన్న ప్రశ్న తలెత్తింది.
భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ఏపిలో జగన్ సర్కార్ వివిధ సంక్షేమ పథకాల కింద వేల కోట్ల రూపాయలు పంపిణీ చేస్తుండటంతో ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులకు సైతం రుణాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ ప్రథాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్, ఆర్థిక శాఖ అధికారులు పదేపదే ఢిల్లీకి వెళ్లి రుణ పరిమితి పెంపు కోసం తీవ్ర ప్రయత్నలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలను వివరించి అంతకు ముందు సంవత్సరంలో అదనంగా తీసుకున్న రుణాల కోత నుండి ఈ ఏడాది మినహాయించాలని కోరారు.
ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మరో రూ.10,500 కోట్ల రుణానికి అనుమతి ఇచ్చింది. దీంతో డిసెంబర్ వరకు ఉన్న పరిమితిని పెంచినట్లయ్యింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ మొత్తాన్ని రాష్ట్రం అప్పుగా తీసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో తొమ్మిది నెలల కాలానికి రాష్ట్ర రుణ పరిమితి రూ.31,251 కోట్లకు పెరిగినట్లు అయ్యింది. ఏపికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.42,472 కోట్ల రుణం తీసుకునే అర్హత ఉందని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చింది.